ఇన్నర్ రింగ్ రోడ్ కేసు .. ముగిసిన నారా లోకేష్ సీఐడీ విచారణ, రేపు మళ్లీ రమ్మన్న అధికారులు
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సీఐడీ విచారణ ముగిసింది. రేపు మరోసారి సీఐడీ విచారణకు రావాల్సిందిగా లోకేష్ను ఆదేశించింది.

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సీఐడీ విచారణ ముగిసింది. ఉదయం దాదాపు 6 గంటల పాటు లోకేష్ను సీఐడీ ప్రశ్నించింది. ఆయనను 30 ప్రశ్నలు అడిగినట్లుగా తెలుస్తోంది. విచారణకు లోకేష్ ఏమాత్రం సహకరించలేదని సీఐడీ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే రేపు మరోసారి సీఐడీ విచారణకు రావాల్సిందిగా లోకేష్ను ఆదేశించింది.
అనంతరం నారా లోకేష్ మీడియాతో మాట్లాడుతూ.. దాదాపు ఆరున్నర గంటలు విచారణ జరిగిందన్నారు. ఇన్నర్ రింగ్ రోడ్డుకి సంబంధించి అడగలేదని.. 50 ప్రశ్నల్లో ఒక్కటి కూడా కుటుంబ సభ్యులు ఎలా బాగుపడ్డారని అడగలేదని లోకేష్ తెలిపారు. హెరిటేజ్లో డైరెక్టర్గా ఉన్నప్పుడు ఏం జరిగిందో అడిగారని.. మంత్రిగా ఉన్నప్పుడు జరిగిన జీవోఎం వివరాలు అడిగారని ఆయన వెల్లడించారు. కక్ష సాధింపు తప్ప...ఎలాంటి ఆధారాలు లేకుండా దొంగ ఎఫ్ఐఆర్లు పెట్టారని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తనను ప్రజల్లోకి వెళ్లకుండా అడ్డుకున్నారని.. మళ్లీ రేపు రావాలని 41ఏ ఇచ్చారని ఆయన తెలిపారు. రేపు విచారణకు హాజరవుతానని లోకేష్ స్పష్టం చేశారు. అలైన్మెంట్కు సంబంధించి ఒకే ఒక్క ప్రశ్న అడిగారని తెలిపారు. హెరిటేజ్కు సంబంధించిన పదవులు, ప్రభుత్వంలో ఏయే పదవుల్లో ఉన్నారని అడిగారని లోకేష్ చెప్పారు. గవర్నర్ అనుమతి లేకుండా ఎందుకు చంద్రబాబు ను అరెస్ట్ చేశారని ఆయన ప్రశ్నించారు. అరగంట, గంట మంత్రుల కామెంట్స్ కు తాను సమాధానం చెప్పనని లోకేష్ వెల్లడించారు. పోలవరం ఎందుకు కట్టలేదో ముందు అంబటి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.