సీమలో ప్రాజెక్ట్లు కాదు.. ముందు టీడీపీ కార్యకర్తలను కాపాడండి: జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలనం
రాయలసీమ టీడీపీ నేతల సమావేశంలో పార్టీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీమలో ప్రాజెక్ట్ల కంటే ముందు కార్యకర్తలను కాపాడాలని హైకమాండ్ను కోరారు. సమావేశానికి అందర్నీ ఆహ్వానించాలని.. ఒకరిద్దరు నేతల కనుసన్నల్లో సమావేశం జరగడం సరికాదని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు
రాయలసీమ టీడీపీ నేతల సమావేశంలో పార్టీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీమలో ప్రాజెక్ట్ల కంటే ముందు కార్యకర్తలను కాపాడాలని హైకమాండ్ను కోరారు. సమావేశానికి అందర్నీ ఆహ్వానించాలని.. ఒకరిద్దరు నేతల కనుసన్నల్లో సమావేశం జరగడం సరికాదని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఈ విషయాలపై చంద్రబాబు దృష్టిపెట్టాలని ఆయన హితవు పలికారు.
కాగా, గత నెల 3న మున్సిపల్ అధికారుల తీరును నిరసిస్తూ జేసీ ప్రభాకర్ రెడ్డి మున్సిపల్ కార్యాలయంలోనే నిద్రపోయారు. తాను సమావేశం ఉందని సమాచారం పంపితే ఈ సమావేశానికి అధికారులు రాకుండా అడ్డుకొన్నారని ఆయన పరోక్షంగా ఎమ్మెల్యే పెద్దారెడ్డిపై విమర్శలు గుప్పించారు.
అధికారులను ఇబ్బందిపెట్టొద్దనే ఉద్దేశ్యంతోనే తాను రాజీకి వచ్చినట్టుగా ఆయన చెప్పారు. అధికారులు, సిబ్బందిని కాపాడాల్సిన బాధ్యత తనపై ఉందని ఆయన గుర్తు చేసుకొన్నారు.జేసీ ప్రభాకర్ రెడ్డి సమావేశం నిర్వహించే సమయానికి కరోనాపై అవగాహన ర్యాలీని ఎమ్మెల్యే పెద్దారెడ్డి నిర్వహించారు. ఈ ర్యాలీ పూర్తైన తర్వాత మున్సిపల్ అధికారులు ఇళ్లకు వెళ్లిపోయారు. మధ్యాహ్నం నుండి కమిషనర్ సెలవుపై వెళ్లిపోయారు. ఈ పరిణామం జేసీ ప్రభాకర్ రెడ్డికి ఆగ్రహం తెప్పించింది. మున్సిపల్ అధికారులు కన్పించడం లేదని ఆయన పోలీసులకు పిర్యాదు చేశారు.