పోలీసులు, టిడిపి శ్రేణుల మధ్య ఉదయం చోటుచేసుకున్న తోపులాటలో చింతమనేని  అస్వస్థతకు గురయ్యారు. 

అమరావతి: ఏసిబి అదుపులో వున్న మాజీ మంత్రి అచ్చెన్నాయుడుని కలవడానికి బయలుదేరిన టిడిపి మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సమయంలో పోలీసులు, టిడిపి శ్రేణుల మధ్య చోటుచేసుకున్న తోపులాటలో చింతమనేని అస్వస్థతకు గురయ్యారని... అయినప్పటికి పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి ఉదయం ఉదయం నుండి ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్ లో ఉంచినట్లు సమాచారం. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

అయితే సాయంత్రం సమయంలో పోలీసులు చింతమనేనిని విడిచిపెట్టారు. దీంతో వెంటనే ఆయనకు ఫోన్ చేసిన టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ఇబ్బందుల్లో వున్న నాయకులకు పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలని చింతమనేనికి లోకేష్ సూచించారు. 

ఇంటికి బయలుదేరిన తనను కావాలని పోలీసులు అడ్డుకున్నారని...కోవిడ్ పరీక్షలు, ఇతర నిబంధనల పేరుతో అదుపులోకి తీసుకున్నారని చింతమనేని తెలిపారు. ప్రభుత్వం పోలీసుల చేత ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టాలని చూసినా తమ పోరాటం ఆపేది లేదని చింతమనేని స్పష్టం చేశారు.

READ MORE అచ్చెన్నాయుడికి వైసిపి ప్రలోభాలు... లొంగలేదు కాబట్టే అరెస్ట్: దూళిపాళ్ల

శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలి మండలంలోని సొంత గ్రామం నిమ్మాడలో టిడిపి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడును అరెస్టు చేశారు. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఈఎస్ఐ కుంభకోణం జరగడం... ఈ స్కాంతో ఆయనకు సంబంధాలున్నట్లు తేలడంతో ఏసిబి పోలీసులుఅరెస్ట్ చేసినట్లు సమాచారం. 

భారీ బందోబస్తు మధ్య ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు చేసిన తర్వాత ఆయనను విజయవాడకు తరలిస్తున్నారు. అచ్చెన్నాయుడు సిఫార్సుల కారణంగానే అక్రమాలు జరిగినట్లు దర్యాప్తులో నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. తెలుగుదేశం లెజిస్లేచర్ పార్టీ (టీడీఎల్పీ) ఉప నేతగా ఆయన ఉన్నారు. శాసనసభ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో అచ్చెన్నాయుడి అరెస్టు జరిగిందని టిడిపి నాయకులు ఆరోపిస్తున్నారు. 

అచ్చెన్నాయుడు కార్మిక మంత్రిగా ఉన్నప్పుడు రూ.988 కోట్ల మెడికల్ సామాగ్రి కొనుగోళ్లు జరిగాయని, ఇందులో రూ.150 కోట్ల కుంభకోణం జరిగిందని అవినీతి నిరోధక శాఖ (ఎసీబీ) అధికారులు గుర్తించారు. అచ్చెన్నాయుడు సిఫార్సు మేరకు నామినేషన్ పద్ధతిలో కొనుగోళ్లు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి.

మరో మాజీ మంత్రి పాత్ర కూడా ఈసీఐ కుంభకోణంలో పాత్ర ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఆయనకు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఆయనను కూడా అరెస్టు చేసే అవకాశం ఉందని అంటున్నారు. అచ్చెన్నాయుడి కుటుంబ సభ్యులను కూడా విచారించే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. ఈఎస్ఐ కుంభకోణంలో మొత్తం 40 మంది ఉద్యోగుల పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది. మందులు, పరికరాలు,ల్యాబ్ పరికరాల కొనుగోళ్లలో అక్రమాలు జరిగినట్లు ఏసీబీ గుర్తించింది. నకిలీ కొటేషన్లతో వ్యవహారం నడిపినట్లు తేలింది. కొనుగోళ్ల టెండరింగులో అచ్చెన్నాయుడి కుమారుడి పాత్ర ఉన్నట్లు ఆరోపణలున్నాయి.