సారాంశం

ఇష్టం వచ్చినట్లు మాట్లాడినందునే రోజాకు బుద్ధి చెప్పానని వ్యాఖ్యానించారు టీడీపీ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి .  దుర్మార్గపు చర్యలతో మమ్మల్ని భయపెట్టలేరని.. మిగిలిన నాలుగు నెలలైనా బుద్ధిగా వుండాలని జగన్‌కు సూచించారు. 
 

వైసీపీ సీనియర్ నేత, మంత్రి రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ టీడీపీ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి బండారుకు బెయిల్ లభించింది. విడుదలైన అనంతరం బుధవారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి ఆయన వచ్చారు. అనంతరం సత్యనారాయణ మూర్తి మీడియాతో మాట్లాడుతూ.. ఇష్టం వచ్చినట్లు మాట్లాడినందునే రోజాకు బుద్ధి చెప్పానని వ్యాఖ్యానించారు.

తనపై పెట్టిన కేసులో న్యాయదేవత తనవైపు నిలబడిందన్నారు. రోజాపై తాను చేసిన వ్యాఖ్యలకు వచ్చిన స్పందనను ముఖ్యమంత్రి కూడా విశ్లేషించుకోవాలని బండారు హితవు పలికారు. దుర్మార్గపు చర్యలతో మమ్మల్ని భయపెట్టలేరని.. మిగిలిన నాలుగు నెలలైనా బుద్ధిగా వుండాలని జగన్‌కు సూచించారు. 

ALso Read : మహిళలను కించపర్చడమేనా మీ సంస్కృతి: బండారు వ్యాఖ్యలకు రోజా కౌంటర్

కాగా.. రోజాపై అసభ్య పదజాలంతో మాట్లాడరనే ఫిర్యాదతో బండారు సత్యనారాయణపై గుంటూరు జిల్లా నగరపాలెం పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. బండారు సత్యనారాయణపై ఐపీసీ సెక్షన్ 153ఏ, 504, 354ఏ, 505, 506, 509, 499, ఐటీ సెక్షన్ 67 కింద కేసు నమోదు చేశారు. ఇక, బండారు సత్యనారాయణపై చర్యలు తీసుకోవాలని ఏపీ డీజీపీకి రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ కూడా ఇటీవల లేఖ రాసిన సంగతి తెలిసిందే. దీంతో ఆయనను అక్టోబర్ 2న అరెస్ట్ చేశారు. అనంతరం జీజీహెచ్‌లో వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో హాజరుపరిచారు. ఇదే సమయంలో బండారు సత్యనారాయణ మూర్తి బెయిల్ పిటిషన్ దాఖలు చేయడంతో న్యాయస్థానం సానుకూలంగా స్పందించింది.