Asianet News TeluguAsianet News Telugu

వివేకా కేసు.. అవినాష్ రెడ్డి గురించి జిల్లా అంతా తెలుసు, అరెస్ట్ ఖాయం : టీడీపీ నేత బీటెక్ రవి

తన అన్న సీఎం పదవిని, తన ఎంపీ పదవిని అడ్డుపెట్టుకుని వివేకా హత్య కేసు నుంచి బయటపడేందుకు వైఎస్ అవినాష్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు టీడీపీ నేత బీటెక్ రవి. అవినాశ్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేయడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు.

tdp leader b tech ravi sensational comments on kadapa mp avinash reddy in  ys viveka murder case ksp
Author
First Published Apr 26, 2023, 5:53 PM IST

వైఎస్ వివేకా కేసుకు సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేశారు టీడీపీ నేత బీటెక్ రవి. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తన అన్న సీఎం పదవిని, తన ఎంపీ పదవిని అడ్డుపెట్టుకుని వివేకా హత్య కేసు నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అవినాష్ గురించి జిల్లా ప్రజలందరికీ తెలుసునని.. సీబీఐపై ఆయన ఎందుకు ఆరోపణలు చేస్తున్నారని బీటెక్ రవి ప్రశ్నించారు. తప్పు చేసినందుకే సీబీఐ దోషి అని అంటోందన్నారు. అవినాశ్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేయడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. వివేకా హత్యతో తెలుగుదేశం పార్టీకి సంబంధం లేదని.. తమపై అపనిందలు వేసి లబ్దిపొందాలని అవినాష్ చూస్తున్నాడని బీటెక్ రవి ఆరోపించారు. 

కాగా.. వివేకానంద రెడ్డి హత్య కేసు సంచలనంగా మారింది. ఈ హత్య కేసు విచారణ బాధ్యతలు సిబిఐకి అప్పగించిన తర్వాత కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే వివేకా హత్యతో సంబంధాలున్నాయని అనుమానిస్తూ ఇప్పటికే కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి.సీఎం సతీమణి వైఎస్ భారతి సొంత మేనమామ భాస్కర్ రెడ్డిని సిబిఐ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో అవినాష్ రెడ్డిని కూడా సిబిఐ అరెస్ట్ చేయడం ఖాయం అంటూ వైసిపి ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు. 

Also Read: అవినాష్ రెడ్డికి షాక్: వైఎస్ వివేకా అస్తులపై షర్మిల కౌంటర్

వైఎస్ వివేకా హత్యకేసులో చోటుచేసుకుంటున్న పరిణామాలపై చర్చించేందుకు కడప నాయకులతో అవినాష్ రెడ్డి సమావేశమయ్యారు. కడప పట్టణంలోని ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో జరిగిన ఈ సమావేశానికి ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తో పాటు ఇతర నాయకులు పాల్గొన్నారు. ఈ సమావేశం అనంతరం రాచమల్లు సంచలన వ్యాఖ్యలు చేసారు.

వివేకా హత్యకేసులో అవినాష్ రెడ్డిని సిబిఐ అరెస్ట్ చేయడం ఖాయమని రాచమల్లు అన్నారు. అయితే అరెస్టయినప్పటికీ బెయిల్ పై బయటకు వస్తారని అన్నారు.  అవినాష్ రెడ్డి ఏ నేరమూ చేయలేదు... వ్యవస్థలను మేనేజ్ చేస్తూ ఇరికించారని అన్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కుట్రపన్ని అవినాష్ ను వివేకా హత్యకేసులో ఇరికించాడని ఆరోపించారు. రాజకీయంగా నేరుగా ఎదుర్కోలేకే ఇలా కుట్రలతో దెబ్బతీయాలని చూస్తున్నారని రాచమల్లు పేర్కొన్నాడు. 

ప్రజా సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చిన అవినాష్ రెడ్డి హింసను ప్రేరేపించే వ్యక్తి కాదని... ఇది ఇప్పటికీ తాను నమ్ముతున్నానని అన్నారు. నిందితుడిగా చేర్చినంత మాత్రాన నేరం చేసినట్లు కాదని అన్నారు. నిజంగానే వివేకా హత్యలో అవినాష్ రెడ్డి పాత్ర వుందని రుజువైతే రాజకీయాల నుండి తప్పుకుంటానని అన్నారు. సిబిఐ అనుమానించడం కాదు కోర్టులో నేరం రుజువైన వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని మరోసారి స్పష్టం చేసారు వైసిపి ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios