పల్నాడు జిల్లా కారంపూడిలో టీడీపీ నేతపై దాడి జరిగింది. టీడీపీ నేత నాగేశ్వరరావుపై ఆయన ప్రత్యర్థులు దాడి చేశారు.
పల్నాడు జిల్లా కారంపూడిలో టీడీపీ నేతపై దాడి జరిగింది. టీడీపీ నేత నాగేశ్వరరావుపై ఆయన ప్రత్యర్థులు దాడి చేశారు. ఈ దాడిలో నాగేశ్వరరావు తీవ్రంగా గాయపడ్డారు. అయితే ప్రత్యర్థుల దాడి నుంచి తప్పించుకున్న నాగేశ్వరరావు అక్కడి నుంచి పోలీసు స్టేషన్కు చేరుకున్నట్టుగా తెలుస్తోంది. దీంతో పోలీసులు గోరంట్ల నాగేశ్వరరావును పోలీసులు గురజాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే టీడీపీలో తిరగవద్దని వైసీపీ నేతలే ఈ దాడి చేశారని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. మరోవైపు నిందితులు తనను చంపేస్తారని నాగేశ్వరరావు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. గతంలో టీడీపీ నిర్వహించిన ఇదేం ఖర్మ కార్యక్రమం సందర్భంగా చోటుచేసుకున్న ఘర్షణలతో మాచర్ల రణరంగంగా మారిన సంగతి తెలిసిందే. తాజాగా కారంపూడి మండలం మిరియాల గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి టీడీపీకి చెందిన బత్తుల ఆవులయ్య ట్రాక్టర్కు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పుపెట్టారు. అయితే మిరియాలలో వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ ధ్వంజ స్థంభం ప్రతిష్ట నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం మాచర్ల టీడీపీ ఇన్ఛార్జ్ జూలకంటి బ్రహ్మారెడ్డిని ఆవులయ్యకు చెందిన ట్రాక్టర్పై ఊరేగింపుగా తీసుకొచ్చారు.
అయితే అర్దరాత్రి వేళ ఊరేగింపుకు వినియోగించిన ఆవులయ్య ట్రాక్టర్ను దుండగులు తగలబెట్టారు. ఈ ఘటనలో ట్రాక్టర్ పూర్తిగా కాలిపోయింది. అయితే వైసీపీ కార్యకర్తలే ఈ పని చేశారని టీడీపీ వర్గీయులు ఆరోపిస్తున్నారు. వైసీపీ శ్రేణులు రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తున్నారని చెబుతున్నారు. వైసీపీ దాడులకు భయపడేదే లేదని జూలకంటి బ్రహ్మారెడ్డి తెలిపారు.
