టిడిపి మాజీ ఎమ్మెల్యే అరెస్ట్... పిఠాపురంలో ఉద్రిక్తత
తెలుగుదేశం పార్టీ నాయకులు, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మను పోలీసులు అరెస్ట్ చేశారు.
పిఠాపురం: ఏలేరు ఆధునికీకరణ ఫేజ్-2 పనుల ఆలస్యమవుతుండటంతో రైతులు నష్టపోతున్నారని... వైసిపి ప్రభుత్వం వెంటనే పనులు ప్రారంభించిన రైతులను ఆదుకోవాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నాలుగురోజుల క్రితమే పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టిడిపి నేత ఎస్వీఎస్ఎన్ వర్మ పాదయాత్రకు పిలుపునిచ్చి ఇవాళ(ఆదివారం) అందుకు సిద్దమయ్యారు. అయితే పాదయాత్రకు అనుమతిని నిరాకరించినా అతడు వెనక్కితగ్గక పోవడంతో పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు.
పాదయాత్రకు సిద్దమై కార్యాలయం నుండి బయటకు వచ్చినవెంటనే వర్మను పోలీసులు అరెస్ట్ చేయడానికి ప్రయత్నించారు. దీంతో ఆయన అనుచరులు, టిడిపి కార్యకర్తలను వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఇరువురి మధ్య తోపులాట జరిగి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అయితే చివరకు వర్మను అరెస్ట్ చేసిన పోలీసులు కాకినాడ పోలీస్ స్టేషన్ కు తరలించారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మట్లాడుతూ... కరోనా నిబంధనలకు లోబడే పాదయాత్ర చేస్తానని తెలిపినా పోలీసుల అనుమతి నిరాకరించారన్నారు. దీంతో అనుమతి కోరుతూ హైకోర్టును కూడా ఆశ్రయించానని... హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసినట్లు తెలిపారు. ఎమ్మెల్యే పెండెం దొరబాబు, ఎంపీ వంగ గీత ఒత్తిడి వల్లే పోలీసులు పాదయాత్రకు అనుమతి ఇవ్వలేదని వర్మ ఆరోపించారు.