టీడీపి మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అరెస్టు: కేసులు నమోదు
మాజీ మంత్రి అచ్చెన్నాయుడి అరెస్టుకు నిరసనగా ఆందోళనకు ప్రయత్నించిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఆయనను ఏలూరు రూరల్ పోలీసు స్టేషన్ కు తరలించారు.
ఏలూరు: తెలుగుదేశం పార్టీ (టీడీపీ) మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను పోలీసులు అరెస్టు చేశారు. మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని వ్యతిరేకిస్తూ తన అనుచరులతో కలిసి ఆయన ఆందోళనకు దిగారు. ఆయన అనుచరులతో కలిసి కలపర్రు టోల్ గేట్ వద్దకు వచ్చారు.
దీంతో ఆయనను పోలీసు అరెస్టు చేశారు. ఆయనతో సహా 8 మందిని అరెస్టు చేశారు. వారిని పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు రూరల్ పోలీసు స్టేషన్ కు తరలించారు. దాంతో పోలీసు స్టేషన్ లోనే చింతమనేని ప్రభాకర్ దీక్షకు దిగారు. చింతమనేని వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు.
ఈఎస్ఐ కుంభకోణం కేసులో అరెస్టయిన టీడీపీ నేత, మాజీ మంత్రి కె. అచ్చెన్నాయుడిని గుంటూరు ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే. ఆయనకు ప్రత్యేక వార్డులో చికిత్స అందిస్తున్నారు. విజయవాడ సబ్ జైలు నుంచి ఆయనను గుంటూరు ప్రత్యేక ఆస్పత్రికి తరలించారు. జైలు అధికారుల అనుమతితో ఆయనను ఆస్పత్రికి తరలించారు.
కోర్టు ఆదేశాలతో ఆయనను ఆస్పత్రికి తరలించారు. ఇటీవలే అచ్చెన్నాయుడికి ఆపరేషన్ జరిగింది. ఈఎస్ఐ స్కామ్ కేసులో అచ్చెన్నాయుడిని ఏసీబీ అధికారులు శుక్రవారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
అచ్చెన్నాయుడిని శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో అరెస్టు చేసి విజయవాడకు తరలించారు. ఆయనను ఏసీబీ అధికారులు ప్రత్యేక కోర్టు ముందు శుక్రవారంనాడు ప్రవేశపెట్టారు. ఆయనకు ఏసీబీ ప్రత్యేక కోర్టు 14 రోజులు రిమాండ్ విధించారు. అనారోగ్యం కారణంగా ఆయనను ఆస్పత్రికి తరలించాలని కోర్టు ఆదేశించారు.
దాంతో ఆయనను తొలుత విజయవాడ సబ్ జైలుకు తరలించి, ఆ తర్వాత గుంటూరు ఆస్పత్రికి తరలించారు. ప్రధాన నిందితుడైన ఈఎస్ఐ మాజీ డైరెక్టర్ రమేష్ కుమార్ ను కూడా అధికారులు న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టారు. ఆయనకు కూడా రెండు వారాల రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపించారు.