మీ సాక్షిలో నూటికి 80 శాతం రైతులు, వ్యవసాయం గురించే: జగన్ కు ఆలపాటి లేఖ
లాక్ డౌన్ కారణంగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకోవాల్సిందిగాకోరుతూ ముఖ్యమంత్రి జగన్ కు టిడిపి మాజీ ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఓ బహిరంగ లేఖ రాశారు.
గుంటూరు: కరోనా వ్యాప్తి, లాక్ డౌన్ కారణంగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న ఏపి రైతులను ఆదుకోవాలంటూ టిడిపి మాజీ శాసనసభ్యుడు ఆలపాటి రాజేంద్రప్రసాద్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కోరారు. ఈ మేరకు రైతుల సమస్యలను వివరిస్తే ముఖ్యమంత్రికి ఓ బహిరంగ లేఖ రాశారు ఆలపాటి.
బహిరంగ లేఖ యధావిదిగా
అత్యంత గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారికినమస్కారములతో విన్నవించుకుంటున్న లేఖాంశాలు.
మహాశయా...
కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని ఆతలాకుతలం చేసి ఆర్థిక విధ్వంసాన్ని సృష్టిస్తున్న ఈ నేపథ్యంలో సమస్త భారతదేశాన్ని కోవిడ్19 లక్ష పడగల రాక్షస సర్పంలా పెనవేసి కొంటున్న ఈ విపత్కర పరిస్థితుల్లో 13 జిల్లాల చిన్న రాష్ట్రమైన మన ఆంధ్రప్రదేశ్ ని పరిరక్షించడానికి మీరు మీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను గుర్తిస్తూనే, అన్నపూర్ణగా దేశానికీ ధాన్యగారంగా నీరాజనం అందుకున్న ఈ సస్యశ్యామల సుక్షేత్రం మీద రైతులు ఎడతెరిపి లేకుండా ఎదుర్కొంటున్న కొన్ని సమస్యలను, వేదనలను, నేను లికిత పుర్వకముగా మీ దృష్టికిని తీసుకు వస్తున్నాను. మీరు రాజకీయ, సామాజిక,వర్గ స్పృహలకి, అతీతంగా దీనిని స్వీకరిస్తారని ఆశిస్తున్నాను ముఖ్యమంత్రి గారు,
ఈ భూమ్మీద పైరు పంటలు ప్రారంభమై 10 వేల సంవత్సరాలలో కరువు కాటకాలు, చిడ పిడలు, రైతులను తద్వరా అన్నానికి వారి మీద ఆధారపడే అన్ని వర్గల ప్రజలను వేధిస్తూనే ఉన్నాయి. కానీ, మన అదునిక ప్రభుత్వ యుగం మొదలైన తరువాత ప్రకృతి విపత్తులకి సంబంధం లేని అస్తవ్యస్త వ్యవసాయ విధానాల కారణంగా రైతు కుంగి కునారిల్లు పోతున్నారన్నది కటోరవాస్తవం. మీకు తెలియకుండా ఉండదు “అన్నం బహు కుర్వీత:”(let there be abundant food) అని ఋషి వాక్కు. మనవంటి 70 శాతం వ్యవసాయ ఆధారిత రాష్ట్రానికి రైతే మొదటి దిక్కు. ఇప్పుడు కొనసాగుతున్న లాక్ డొన్ ఆంధ్రప్రదేశ్ రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి నరక ప్రాయ దుస్థితి మీద తగినంతగా దృష్టి సారించాల్సి ఉంది.
నిజానికి రైతు, రైతుకూలీల ది ఒక ప్రత్యేక ప్రపంచం అక్కడ అన్నీ మనం అనుకున్నంత ఆకుపచ్చగా, అందముగా ఉండవు. మీరు అధికారుల, శాసనసభ్యులు, మంత్రివర్యుల కళ్ళతోనే కాకుండా రైతు ప్రపంచంలోని కి స్వయంగా వ్యక్తి గతంగా చూడండి. మీ దృక్కోణం మీ ప్రాధాన్యతలు మార్చుకొనే అవకాశం ఉంది. అందువల్ల మీరు రైతుకు ముఖ్యంగా రైతు బిడ్డలకు మీరు ఊహించనంత మేలు జరుగుతుందని నా నమ్మకం. సాక్షి దినపత్రికలో ప్రతిరోజు సంపాదకులు ప్రచురిస్తున్న వైయస్సార్ కొటేషన్లు నూటికి 80 శాతం రైతుల గురించే మరియు వ్యవసాయం గురించి ఉoటాయని గుర్తు చేస్తున్నాను
ఆంధ్రప్రదేశ్లోని కౌలు రైతు దుస్థితి గురించి జరుగుతున్న చర్చలు వాదోపవాదాలు మీ దృష్టికి రాలేదని భావించలేము. వ్యవసాయ రంగాన్ని పీడిస్తున్న రైతులలో దాదాపు 75%
కౌలుదారులే. కౌలుదారులకు ప్రభుత్వ సాయం అందటానికి సవాలక్ష అర్హతలు, అభ్యంతరాలు ముందుకు వస్తున్నాయి. మన రాష్ట్రంలో ఆ మాటకు వస్తే భారతదేశంలో అనాదిగా కౌలు వ్యవస్థ పరస్పర విశ్వాసం మీద, మన సాంప్రదాయం మీద, నోటి మాట ఒప్పందాల మీద, ఆధారపడి కొనసాగుతోంది. ఈ ఒప్పందానికి సాధారణంగా చట్ట బద్ధత, ఆధారం ఏమీ ఉండదు. వీళ్ళ పరిస్థితి ఏమిటి? వందలాది కొత్త నిర్ణయాలు కొత్త కొత్త ఉత్తర్వులు తీసుకొస్తున్నా ముఖ్యమంత్రిగా మీరు మన రాష్ట్రంలో నానాటికీ కుంగిపోతున్న కౌలుదారులను ఉద్ధరించడానికి అవసరమైన చర్యలు చేపట్ట లేరా?యాజమాన్య హక్కు పత్రాలు చూపించకపోతే కౌలుదారు పండించిన పంటకి విక్రయం గాని, కొనుగోలు గాని, కుదరదంటే ఆ రైతు ఏ వ్యవసాయ బావిలో దూకాలి, ముఖ్యమంత్రి గారు? అని ప్రశ్నించారు.
అరటి, బత్తాయి, మామిడి, నిమ్మ, దానిమ్మ, సపోటా, కర్బూజ, వంటి ఉద్యానవన పంటలు రైతుల పరిస్థితి దీనికి భిన్నంగా ఏమీ లేదు. మా తెనాలి చుట్టుపక్కల విరివిగా పండే పసుపు విక్రయ ధరలు కూడా ఎన్నడూ లేనంత తక్కువగా ఉన్నాయి. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఆఖరి పసుపు కొమ్ము కూడా మంచి ధరకు కొనుగోలు చేసిన చరిత్ర మన కళ్ళ ముందే ఉంది. పైన పేర్కొన్న పంటలన్నీ ఎక్కువ కాలం నిలువ ఉంచ కలిగేవి కావు. Perishable Goods నిల్వ వుంచటానికి మనకేమో తగినన్ని శీతల గిడ్డంగులు లేవు. మార్కెట్ కి వచ్చిన వెంటనే వ్యాపారులు, ప్రభుత్వాలు కొనుగోలు చేయడం ఒక్కటే రైతులకు ఊపిరినిలిపే దారి. ఆంధ్ర ప్రదేశ్ రైతు లోకానికి ముఖ్యమంత్రిగా మీరే చేయూతనిచ్చి నిజంగా నేనున్నానని అభయమిచ్చి అది ఆచరించి చూపించాలి. రాజకీయాలను తాత్కాలికంగా పక్కన పెట్టి మీరు బాధ్యతగా వ్యవహరించవలసిన అత్యంత క్లిష్టమైన కరోనా సందర్భమిది. కోతలు అయిపోయినాయి, వేసవి ముగిసింది, అయినా మనం రక్షించబడ లేదు. ఇక మీ విచక్షణ దే భారం.
ఈ లాక్ డౌన్ దశ ముగిసిన తరువాత దేశ ఆర్థిక స్థితి ఏమిటి. 90 శాతం వరకు ఆదాయం పడిపోయిన రాష్ట్రాలు ఆర్దిక ఉపద్రవం సంగతి ఏమిటి అని మన ఆర్థిక నిపుణులు అప్పుడే
తలలు బద్దలు కొట్టుకుంటున్నారు. ఆంధ్ర ప్రదేశ్ దీనికి మినహాయింపు కాదని మనందరికీ తెలుసు.వ్యవసాయ రంగమే మన ఆర్థిక రంగపు వెన్నుముక. ఆ వెన్నుముక విరిగే ప్రమాదం ముంచుకొచ్చింది, కొనుగోళ్లు లేక రైతులు తోటలలో, రోడ్లమీద పారబోస్తున్న ఉద్యానవన పంటలు కరోనా లాక్ డౌన్లో ప్రత్యేక చర్య గా ప్రజల రోగ నిరోధ క శక్తిని పెంచేందుకు కొనుగోలు చేసి ఉచితంగా, నామమాత్రపు ధరతో యుద్ద ప్రాతిపదిక మీద పంపిణీ చేసేలా నిర్ణయం తీసుకోవాలని మీ ప్రభుత్వానికి నేను మనవి చేస్తున్నాను. అలాగే మీరు శాసనసభలో కరతాళ ధ్వనుల మధ్య
రైతుల కోసం ప్రకటించిన 2,300 కోట్ల ఇన్ పుట్ సబ్సిడీ ఏమైందో రాష్ట్ర రైతాంగానికి ఒకసారి వివరించవలసిందిగా కోరుతూ, పోయిన వానా కాలపు వరదలు లో అల్లకల్లోలమైన రైతు
కుటుంబాలను అన్ని విధాల ఆదుకుంటామని మీరు చేసిన ప్రకటన ఏ గాలివానకు కొట్టుకు పోయిందో చెప్పాలని కూడా నోరులేని సన్నకారు మధ్యతరగతి రైతుల తరపున మీ
“సత్యమేవ జయతే” ప్రభుత్వాన్ని అడుగుతున్నాను.
మీరు బడ్జెట్లో ధరల స్థిరీకరణకు కేటాయించిన మూడు వేల కోట్లని రైతుల కోసం ఉపయోగించే అవకాశాన్ని తక్షణమే పరిశీలించి ఆచరణ లోనికి తీసుకురావాలని కూడా నేను మీకు సూచిస్తున్నాను. ఉపద్రవ సందర్భంగా నిర్వహణ నిధుల నుంచి కూడా మీరు రైతులను పలువిధాల ప్రయోజనాలను సమకూర్చవచ్చునని మీ కార్యాలయంలోని సమర్థవంతులైన అధికారులకు తెలియకుండా ఉండదు.
ప్రపంచ దేశాలలో కరోనా కరాళ నృత్యం కొనసాగుతుండగానే, ఆంధ్రప్రదేశ్ లో అదనంగా మళ్లీరైతుల ఆత్మహత్యలు చూడవలసి వస్తుందేమో నన్నశంఖ మావంటి వాస్తనికవాదులను పీడిస్తోంది. ఒక రైతుబిడ్డగా నీరు కారుచున్న గుండెతో మరికొంత సానుకూలంగా మరికొంత మానవీయ దృప్పధంతో రైతు సమస్యల పట్ల స్పందించాలని అధికార పీఠాన్ని, మీ వ్యక్తిగత హృదయాన్ని కోరుతున్నాను.
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఏప్రిల్ 24న రాష్ట్ర హైకోర్టు కి 600 మెట్రిక్ టన్నుల టమోటా, 6 నుంచి 7 వేల టన్నుల అరటిని రైతుల నుంచి కొనుగోలు చేసిందని, 35 నియంత్రణ విభాగాలను ఏర్పరిచిందని, తద్వారా 700 కొనుగోలు కేంద్రాలను నిర్వహిస్తున్నామనీ అంకెలు చెబుతూ కౌంటర్ దాఖలు చేస్తూ విన్నవించారు. ఇది వాస్తవమే అనుకున్నా, ఈ చర్యలు కేవలం కంటితుడుపుకె తప్ప రైతుల పంటను కొనుగోలుకు ఏమాత్రం సరిపోవని క్షేత్రస్థాయి వాస్తవాలు స్వయంగా పరిశీలించిన వాడిగా నేను ఖచ్చితంగా చెప్పగలను. ఉదాహరణకి మీ రాజకీయ పుణ్యస్థలంగా భావించే కడప జిల్లాలోనే తీసుకోండి, మీరు నియమించిన పులివెందుల అభివృద్ధి కమిటీ బాధ్యులను అడిగి తెలుసుకోండి. కడప జిల్లా ప్రాంతంలో ఛీనీ, అరటి తోటలకు ప్రసిద్ధి. రోజుకి రెండు వందల నుంచి 250 లారీలు అరటి మార్కెట్ లోని వస్తాయి. అరటికి టన్నుకి 3400/-MSP, ఛీనీ టన్నుకి 14000/- MSP మద్దతు ధర ప్రకటించారు కానీ కొంటున్నది 15 నుంచి 20 లారీల వరకు మాత్రమే,భారీగా మిగిలిన పచ్చి సరుకు ఏమైపోవాలి.ఆ రైతులు ఆర్థికంగా నాశనమై పోరా.
ఒక్క నెల్లూరు జిల్లాలోనే సుమారు 16 లక్షల టన్నుల ధాన్యం పండినదని అధికారులు చెబుతున్నారు. ఎంత ధాన్యం మిల్లర్లు గానీ, ప్రభుత్వం గానీ కొనుగోలు చేసింది. ఆ వివరాలు
ప్రభుత్వం వద్ద ఖచ్చితంగా ఉన్నాయా ? 13 జిల్లాల అన్ని పంటల ఆ రైతుల ఆర్దిక ఘోష కరోనా భయం కంటే ఎక్కువగా వినబడుతున్న అన్నదాతల రోదన. రాష్ట్ర భాండాగారంగా పిలువబడే ఉభయ గోదావరి ప్రాంతములో పండిన పంటల పరిస్థితి ఒకసారి ఆలోచించండి.వ్యవసాయదారులు పాడిని, పశువులను నమ్ముకున్న వారు పడుతున్న నిత్య నిరంతర
శ్రమలను నిత్య అగచాట్లను మీరు దగ్గరగా చూడగలిగితే ఎవరు ఎవరిని ఎలాపిండుకొంటున్నారో మీకు విశదంగా అర్థమవుతుంది, అని మాబోటి వారి ఆశ.
మీ మంత్రివర్గ సహచరులు దాదాపు ప్రతిరోజూ రైతుల ఇబ్బందులను గురించి సమీక్షలు జరుపుతున్నట్లు ప్రకటించుకున్నారు, సంతోషమే కానీ చర్యలు లేని సమీక్షలు వలన, ప్రకటనల వలన, ప్రయోజనం ఏముంది? రైతు అమ్మకానికి తెచ్చిన పంటని తగిన మద్దతుధర లభించేటట్లు గా చూడాలని అదీ కాకపోతే రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని సంబంధిత శాఖలను మీరు ఆదేశించినట్లు వార్తలు వచ్చాయి, వాస్తవంలో ఇది జరుగుతుందా ?మీరు మీ ఆదేశాల ఆచరణ మీద ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారా, క్షేత్రస్థాయిలో ఏమి జరుగుతున్నదో మంత్రులు ,అధికారులను, గట్టిగా అడిగి తెలుసుకుంటున్నరా, మీ ఆదేశాలు అమలు జరుగుతున్నాయని రాష్ట్ర రైతాంగం గంపెడాశలతో ఉంది.
రైతుల పాటు మూడు చెరువులు ఆరు ఎగుమతులుగా సాగుతూ వచ్చిన ఆక్వారంగం పరిస్థితి కూడా అధ్వానంగా మారిన విషయం మీకు కూడా తెలుసు. ఆక్వా రైతులతో పాటు పౌల్ట్రీ, పాడి పరిశ్రమ కూడా నాన్న కష్టాలు పడుతూ పడుతుంది. ఈ రైతాంగం అనుబంధ రంగాలనీ ఇప్పుడు సహాయం కోసం మీ ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్నాయి.
ముఖ్యమంత్రి పదవి అనేది ఏ దిగ్గజ కార్పొరేట్ కంపెనీ సీఎండీ లేక సీఈవో పదవి వంటిది కాదు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇన్ని కోట్ల మంది ప్రజల దైనందిక జీవన ప్రమాణాలని ప్రత్యక్షంగా ప్రభావితం చేయగలడు, కావాల్సిందల్లా రాజకీయ సంకల్పం మాత్రమే.
ప్రపంచంలో అన్ని శక్తుల కన్నా గొప్ప శక్తి ధనశక్తి కాదు అది రాజకీయ అధికారం. (The greatest is not money power but politicalpower) ఇలా అన్నది ప్రసిద్ధ అమెరికన్ వ్యాపారవేత్త వాల్టర్ అనెన్ బెర్గ్. దీనికి ఇటీవల ఒక పని మీద విశ్వ కుబేరుల్లో అగ్రశ్రేణిలో ఉన్న ముఖేష్ అంబానీ తన వ్యక్తిగత విమానంలో ప్రత్యేకంగా వచ్చి మిమ్మల్ని కలిసి వెళ్లడమే దీనికి నిదర్శనం. అధికారంలో ఉన్నంతవరకు మీరు చేయదలచుకున్న ప్రజానుకూల చర్యలను ఎవరు నిలువరించడం సాధ్యం కాదు. మీరు పూను కొనడమే తరువాయి.
ఇట్లు
మీ శ్రేయోభిలాషి, విధేయ రాష్ట్ర పౌరుడు, మాజీ మంత్రి, మాజీ శాసనసభ్యుడు ఆలపాటి రాజేంద్రప్రసాద్