Asianet News TeluguAsianet News Telugu

ఒక్క రోగినుండి 407మందికి కరోనా... ఐసిఎంఆర్ డైరెక్టర్ చెప్పిందిదే: చంద్రబాబు

రాష్ట్రంలో కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో చిత్తూరు జిల్లా కుప్పం పరిస్థితులపై స్థానిక అధికారులతో చర్చించారు మాజీ ముఖ్యమంత్రి, స్థానిక ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు. 

TDP Chief Chandrababu Tele Conference With Kuppam Officers
Author
Kuppam, First Published Apr 13, 2020, 9:37 PM IST

చిత్తూరు:  రాష్ట్రవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గం కుప్పంతో పరిస్ధితులను సమీక్షించారు. ఈ నియోజకవర్గ పరిధిలోని అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో స్థానిక ఆరోగ్య, రెవిన్యూ, పోలీస్, వ్యవసాయ, ఉద్యాన, మున్సిపల్ శాఖల అధికారులు పాల్గొన్నారు.  


''కుప్పంలో పాజిటివ్ కేసులు లేకపోవడం సంతోషం. బాగా చేస్తున్న అధికారులకు అభినందనలు.  రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో అప్రమత్తంగా ఉండాలి. చెక్ పోస్ట్ ల వద్ద బందోబస్తు చర్యలు పెంచాలి. ఒకసారి వస్తే కరోనా వైరస్ అంతటితో ఆపలేము. అందుకే దీనిని మొదట్లోనే నియంత్రించాలి'' అని సూచించారు. 

'' కరోనా విధ్వంసం 3వ ప్రపంచ యుద్దాన్ని తలపిస్తోంది. రెండో ప్రపంచ యుద్దంలోనూ ఇంత ప్రాణనష్టం లేదు. కరోనా రోగుల సంఖ్య మరో రెండు రోజుల్లో 2మిలియన్లు కానుంది. ఇప్పటికే లక్షా 15వేల మంది మరణించారు. న్యూయార్క్ లో శవాలను పూడ్చటానికి కూడా చోటు ఉండటం లేదు. కరోనాతో  సమాజం మొత్తం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఇది ఏ ఊరికో, జిల్లాకో, దేశానికో పరిమితం కాలేదు. దావానలంలా ప్రపంచం అంతా కరోనా విస్తరిస్తోంది'' అని పేర్కొన్నారు. 

''గత 3వారాల్లోనే దేశంలో 100 రెట్లు, మన రాష్ట్రంలో 200రెట్లు పెరిగింది. పాజిటివ్ కేసులు పెరిగితే మనచేతుల్లో ఏమీ ఉండదు. అందుకే అసలు కేసులే రాకుండా చూసుకోవాలి.
 సమష్టి పోరాటంతోనే కరోనా విపత్తు ఎదుర్కోగలం. పరిశుభ్రత ఒక కట్టుబాటుగా పాటించాలి. వ్యక్తిగత పరిశుభ్రత, సామాజిక పరిశుభ్రతే దీనికి మార్గాంతరం'' అని అన్నారు. 

''ఒక రోగినుంచి 407మందికి కరోనా విస్తరిస్తుందని ఐసిఎంఆర్ డైరెక్టర్ తెలిపారు. ఒకరి నుంచి 3500మందికి వ్యాపిస్తుందని వుహాన్ గవర్నర్ తెలిపారు. రోగి కదలికలను బట్టే కరోనా వ్యాపిస్తుంది. టచ్ పాయింట్లను బట్టే  వేగంగా కరోనా వ్యాప్తి వుంటుంది. కుప్పంలో కేసులు రాకుండా చూస్తున్న అధికారులు అందరికీ అభినందనలు'' అని ప్రశంసించారు. 

''డాక్టర్లు, అంగన్ వాడి సిబ్బంది, ఆశావర్కర్లు, పారిశుద్య సిబ్బంది, పోలీసులు ప్రాణాలకు తెగించి పనిచేస్తున్నారు. అధికారులు అందరూ సమిష్టిగా పని చేయాలి.  అన్ని శాఖల సిబ్బంది సమన్వయంగా పని చేయాలి. ప్రజలంతా అధికారులకు పూర్తిగా సహకరించాలి.  కుప్పంలో 100 పంచాయితీలు, 632గ్రామాల్లో పారిశుద్యం మెరుగుపర్చాలి. హైపో క్లోరైడ్ పిచికారీ చేయాలి. ఆసుపత్రుల్లో అత్యవసర మందులు సిద్దంగా ఉంచాలి'' అని అధికారులకు సూచించారు చంద్రబాబు. 

''నెల్లూరు డాక్టర్ మృతే కరోనా తీవ్రతకు నిదర్శనం. వైద్యులు, ఆరోగ్య సిబ్బందికి మాస్క్ లు, పిపిఈలు అందజేయాలి. ఆసుపత్రులలో ఇన్ ఫ్రాస్ట్రక్చర్ సద్వినియోగం చేసుకోవాలి.
 186గ్రామాల్లో ఎన్టీఆర్ సుజల ప్లాంట్లను వినియోగించుకోవాలి. తాగునీటి ఎద్దడి లేకుండా చూడాలి.  మార్కెట్ల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలి. చౌకడిపోలు, మార్కెట్ల వద్ద భౌతికదూరం పాటించాలి. క్వారంటైన్ కేంద్రాలలో వసతులు పెంచాలి'' అని ఆదేశించారు. 

''కుప్పంలో ఇంకా 3వేల మందికి రూ 1000, రేషన్ సరుకులు అందలేదు. కూపన్లు ఇచ్చి ఏ రోజు ఎవరెవరు రేషన్ కు రావాలో ముందే చెప్పాలి. చౌకడిపోల వద్ద భౌతికదూరం పాటించాలి. ఇంటింటికీ రేషన్ పంపిణీ చేస్తే ఈ సమస్య ఉండదు'' అన్నారు. 

''వేసవి 3నెలలు తాగునీటి కొరత లేకుండా చూడాలి. పండ్లతోటలు, పూలతోటల రైతులకు అండగా ఉండాలి. సెరికల్చర్ రైతాంగాన్ని ఆదుకోవాలి. నీటి కొరతతో దిగుబడి తగ్గి, ధర తగ్గి సెరికల్చర్ రైతులు నష్టాల్లో మునిగారు. టమాటా, అరటి, మామిడి, పూలతోటల రైతులు తీవ్రంగా నష్టపోయారు. కోతలు, రవాణా ఖర్చులు కూడా వచ్చే పరిస్థితి లేదు. 
అకాల వర్షాలు, ఈదురుగాలుల వల్ల రైతులు నష్టపోయారు. దెబ్బతిన్న రైతాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వమే ముందుకొచ్చి ఆదుకోవాలి'' అని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ఈ టెలి కాన్ఫరెన్స్ లో ఎమ్మెల్సీ గౌరివాని శ్రీనివాసులు, వివిధ మండలాల అధికారులు పాల్గొన్నారు.


 

Follow Us:
Download App:
  • android
  • ios