స్వర్గీయ నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలను గురువారం ఆయన స్వగ్రామం నిమ్మకూరులో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు నందమూరి కుటుంబ సభ్యులు బట్టలు పెట్టనున్నారు.
టీడీపీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలను గురువారం ఆయన స్వగ్రామం నిమ్మకూరులో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు. బుధవారం మచిలీపట్నంలో జరిగిన బహిరంగ సభ ముగిసిన తర్వాత చంద్రబాబు నేరుగా నిమ్మకూరుకు చేరుకుని అక్కడే బస చేశారు. ఈ సందర్భంగా నందమూరి కుటుంబ సభ్యులు, ఇతర బంధువులతో చంద్రబాబు భేటీ అయినట్లుగా తెలుస్తోంది.
ఎన్టీఆర్ శతజయంతి వేడుకల సందర్భంగా నిమ్మకూరు గ్రామస్తులకు చంద్రబాబు బట్టలు పెట్టనున్నారు. అలాగే నందమూరి కుటుంబానికి అల్లుడైన చంద్రబాబుకు ఎన్టీఆర్ కుమారుడు రామకృష్ణ, హరికృష్ణ కుమార్తె సుహాసినీలు బట్టలు పెట్టనున్నారు. ఎన్టీఆర్ శత జయంతి వేడుకల సందర్భంగా నిమ్మకూరు మొత్తం పసుపుమయంగా మారిపోయింది. టీడీపీ జెండాలు, ఫ్లెక్సీలతో గ్రామం నిండిపోయింది. ఈ కార్యక్రమం ముగిసిన అనంతరం చంద్రబాబు గుడివాడకు చేరుకుని అక్కడ రోడ్ షో నిర్వహిస్తారు.
