ఆంధ్రప్రదేశ్‌లో అన్నదాతల ఆత్మహత్యలపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. వైసీపీ మూడేళ్ల పాలనలో రైతుల ఆత్మహత్యలతో సూసైడ్స్ స్టేట్‌గా మారిపోయిందని విమర్శించారు.

ఆంధ్రప్రదేశ్‌లో అన్నదాతల ఆత్మహత్యలపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. వైసీపీ మూడేళ్ల పాలనలో రైతుల ఆత్మహత్యలతో సూసైడ్స్ స్టేట్‌గా మారిపోయిందని విమర్శించారు. ఏపీ విభజన చట్టం ప్రకారం ఏపీకి రావాల్సిన నిధులపై నోరెత్తని వైసీపీ..మళ్లీ సమైక్య ఆంధ్రప్రదేశ్ అంటూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేయడం మోసపూరితమని మండిపడ్డారు. వైసీపీ ప్రకటనలు బాధ్యతా రాహిత్యంగా ఉన్నాయని అన్నారు. ఏపీకి రాష్ట్ర విభజన కంటే.. వైఎస్ జగన్ పాలన వల్లనే రాష్ట్రానికి ఎక్కువ నష్టం జరిగిందని విమర్శించారు. ఈ మేరకు చంద్రబాబు నాయుడు ట్విట్టర్‌లో పోస్టు చేశారు. 

రైతుల ఆత్మహత్యకు సంబంధించిన పేపర్ క్లిప్పింగ్స్ షేర్ చేసిన చంద్రబాబు.. ‘‘ఏపీలో అన్నదాతల ఆత్మహత్యలు పెరగడం ఆందోళనకరం. వ్యవసాయ రంగ వృద్దిలో, ఆక్వా ఎగుమతుల్లో నాడు రికార్డులు సృష్టించిన రాష్ట్రం... ఇప్పుడు మూడేళ్లలో 1,673 రైతు ఆత్మహత్యలతో సూసైడ్స్ స్టేట్ గా మారిపోయింది. వైసీపీ ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలు రైతులను అప్పులపాలు చేస్తున్నాయి. 

మద్దతు ధర లేకపోవడం, వ్యవసాయ సబ్సిడీలు నిలిచిపోవడం వంటివి అన్నదాతల బలవన్మరణాలకు కారణం అవుతున్నాయి. మరోవైపు ప్రభుత్వ టెర్రరిజం తీరుతో ప్రజలపై వేధింపులు, కక్ష సాధింపులు ఎక్కువయ్యాయి. దీంతో నిస్పృహకు గురైన సామాన్యులు కూడా పెద్ద సంఖ్యలో ప్రాణాలు తీసుకుంటున్నారు. రాష్ట్రంలో ఇన్ని సమస్యలతో ప్రజలు నిరాశా నిస్పృహలతో ఉంటే.. వైసీపీ ప్రభుత్వం వాటిపై దృష్టి పెట్టకుండా, తమ చేతుల్లో లేని సమైక్య రాష్ట్ర అంశంపై బాధ్యతా రాహిత్యంగా ప్రకటనలు చేస్తోంది. రెండు రాష్ట్రాలు కలవాలి, కలపాలి అంటూ ప్రజలను గందరగోళంలోకి నెడుతూ సమస్యలను పక్కదారి పట్టిస్తోంది

ఏపీ విభజన చట్టం ప్రకారం మనకు రావాల్సిన నిధులపై నోరెత్తని వైసీపీ..మళ్లీ సమైక్య ఆంధ్రప్రదేశ్ అంటూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేయడం మోసపూరితం.చెప్పాలంటే రాష్ట్ర విభజన కంటే వైఎస్ జగన్ పాలన వల్లనే రాష్ట్రానికి ఎక్కువ నష్టం జరిగింది. ప్రభుత్వ పెద్దలు ముందు ఆ తప్పులను సరిదిద్దుకోవాలి. ఇప్పటికైనా ప్రజా సమస్యలను పక్కదారి పట్టించే సమైక్య రాష్ట్ర ప్రకటనలు ఆపి... రైతుల ఆత్మహత్యలు, ప్రజల సమస్యలకు కారణాలు విశ్లేషించాలి. సత్వర స్పందనతో ప్రణాళిక అమలుపరిచి అన్నదాతలకు అండగా నిలవాలి’’అని చంద్రబాబు డిమాండ్ చేశారు.