భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా.. ఏ పాలకులూ ప్రవర్తించలేదు: చంద్రబాబు
హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్లో నిర్వహించిన వినాయక చవితి వేడుకల్లో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొన్నారు. భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ఏ పాలకులూ ప్రవర్తించలేదని ప్రతిపక్షనేత గుర్తుచేశారు. మత విశ్వాసాల్లో ప్రభుత్వాలు జోక్యం చేసుకోకూడదని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.
ప్రతి ఒక్క మతాన్ని, మత విశ్వాసాలను గౌరవించాలని ఇది రాజ్యాంగం కల్పించిన హక్కు అని టీడీపీ అధినేత, ప్రతిపక్షనేత చంద్రబాబు అన్నారు. హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్లో నిర్వహించిన వినాయక చవితి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. చంద్రబాబు రాక సందర్భంగా పార్టీ శ్రేణులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికాయి. డప్పు వాయిద్యాల నడుమ కార్యకర్తలు, నేతలు బాణాసంచా కాల్చి తమ అభిమానాన్ని చాటుకున్నారు.
అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.. తెలుగు వారందరికీ వినాయకచవితి శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్లో గణేశ్ ఉత్సవాలను ప్రత్యేకంగా నిర్వహిస్తారని వెల్లడించారు. నగరంలో నిమజ్జనం, వేడుకల సందర్భంగా పటిష్ఠ ఏర్పాట్లతో ఈ ఉత్సవాలను నిర్వహిస్తూ వస్తున్నామని.. భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ఏ పాలకులూ ప్రవర్తించలేదని ప్రతిపక్షనేత గుర్తుచేశారు. మత విశ్వాసాల్లో ప్రభుత్వాలు జోక్యం చేసుకోకూడదని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగా ప్రభుత్వాలు ప్రవర్తించాలని.. అప్పుడే శాంతి, సౌభాగ్యం సాధ్యమన్నారు.