సారాంశం
ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఇటీవల సంభవించిన మిచౌంగ్ తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులను, ప్రజలను ఆదుకోవాలని ఆయన ప్రధానిని విజ్ఞప్తి చేశారు. 22 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని, ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, రూ.10 వేల కోట్ల నష్టం వాటిల్లిందని చంద్రబాబు ప్రస్తావించారు.
ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఇటీవల సంభవించిన మిచౌంగ్ తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులను, ప్రజలను ఆదుకోవాలని ఆయన ప్రధానిని విజ్ఞప్తి చేశారు. తుఫానును జాతీయ విపత్తుగా ప్రకటించి సాయం చేయాలని, రాష్ట్రంలోని 15 జిల్లాల్లో తుఫాను తీవ్ర ప్రభావం చూపించిందని మోడీకి చెప్పారు. 22 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని, ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, రూ.10 వేల కోట్ల నష్టం వాటిల్లిందని చంద్రబాబు ప్రస్తావించారు. 770 కి.మీ మేర రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయని.. తాగునీరు , నీటిపారుదల, విద్యుత్, కమ్యూనికేషన్ రంగాలు పూర్తిగా దెబ్బతిన్నాయని చంద్రబాబు తెలిపారు. తుఫాను నష్టం అంచనాకు కేంద్ర బృందాన్ని పంపాలని టీడీపీ అధినేత కోరారు.
మరోవైపు.. మిగ్చౌం తుపాను ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటించారు. తిరుపతి, బాపట్ల జిల్లాల్లో దెబ్బతిన్న పంటలను స్వయంగా పరిశీలించి రైతులకు ధైర్యం చెప్పారు. తెలుగుదేశం పార్టీ తరపున ఇంటికి రూ.5 వేల సాయం అందిస్తున్నామని చంద్రబాబు పేర్కొన్నారు. తుపాను బాధితులకు ప్రభుత్వం ఒక్కో ఇంటికి రూ.25 వేల చొప్పున ఆర్ధిక సాయం అందించాలని కోరారు. ఎన్నికలు వచ్చినప్పుడు ముద్దులు పెట్టడం, ఆ తర్వాత పిడిగుద్ధులు గుద్దడం , నేరాలు చేయడంలో జగన్ దిట్ట అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. గుండ్లకమ్మ ప్రాజెక్ట్ గేట్ల మరమ్మత్తులు చేయలేని వ్యక్తి మూడు రాజధానులు కడతాడా అని ప్రశ్నించారు. విత్తనాలు ఇవ్వలేని ఈ ప్రభుత్వం అవసరమా అని చంద్రబాబు నిలదీశారు.
టీడీపీ హయాంలో తుపానులు రాకముందే పంట చేతికి వచ్చేలా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామని ఆయన గుర్తుచేశారు. పట్టిసీమ ద్వారా రైతులకు సాగునీరు ఇచ్చామని.. తాను కట్టాననే పట్టిసీమ ద్వారా రైతులకు నీళ్లు ఇవ్వలేదని చంద్రబాబు ఆరోపించారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా రోడ్లు బాలేదని, మురికి కాల్వలు గాలికి వదిలేశారని , ఇసుకపై వున్న ప్రేమ వైసీపీ నేతలకు రైతులపై లేదన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఎవరి జీవన ప్రమాణాలు పెరగలేదని.. దేశంలోనే ఎక్కువ అప్పులున్న రైతులు ఆంధ్రప్రదేశ్లో వున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.
రైతుల బాధను పట్టించుకోని ముఖ్యమంత్రిని దేవుడు కూడా క్షమించడని, మిచౌంగ్ తుఫానుపై రైతులను ఏమాత్రం అప్రమత్తం చేయలేదని చంద్రబాబు దుయ్యబట్టారు. చివరికి గోనెసంచులు ఇచ్చినా ధాన్యాన్ని ఇంటికి తెచ్చుకునేవారని .. రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానని టీడీపీ అధినేత స్పష్టం చేశారు. వచ్చేది టీడీపీ జనసేన ప్రభుత్వమేనని ఆయన జోస్యం చెప్పారు.