వైసీపీ ప్రభుత్వ వేధింపులతోనే వరుపుల రాజా మరణించారని ఆరోపించారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. 12 కేసులతో ఆయనను టెన్షన్ పెట్టారని.. దీనికి తోడు కరోనా కూడా రావడంతో రాజా తీవ్ర అనారోగ్యానికి గురయ్యారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. 

ప్రభుత్వ వేధింపులతోనే వరుపుల రాజా మరణించారని ఆరోపించారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. గుండెపోటుతో మరణించిన వరుపుల రాజా భౌతికకాయానికి ఆయన నివాళులర్పించారు. ఆదివారం హైదరాబాద్ నుంచి రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకున్న చంద్రబాబు.. అనంతరం రోడ్డు మార్గంలో కాకినాడ జిల్లా ప్రత్తిపాడుకు చేరుకున్నారు. అనంతరం రాజా భౌతికకాయానికి నివాళులర్పించి , కుటుంబ సభ్యులను ఓదార్చారు. పార్టీ అన్ని విధాలుగా అండగా వుంటుందని చంద్రబాబు హామీ ఇచ్చారు. అనంతరం టీడీపీ అధినేత మీడియాతో మాట్లాడుతూ.. అక్రమ కేసులతో వరుపుల రాజాను వేధించారని మండిపడ్డారు. 12 కేసులతో ఆయనను టెన్షన్ పెట్టారని.. దీనికి తోడు కరోనా కూడా రావడంతో రాజా తీవ్ర అనారోగ్యానికి గురయ్యారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. 

కాగా.. టీడీపీ సీనియర్ నేత వరుపుల రాజా గుండెపోటుతో శనివారం నాడు రాత్రి మృతి చెందారు. నిన్న రాత్రి గుండెలో నొప్పిగా ఉందని కుటుంబ సభ్యులకు రాజా చెప్పడంతో ఆయనను కాకినాడలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ వరుపుల రాజా తుదిశ్వాస విడిచారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సాలూరు, బొబ్బిలి అసెంబ్లీ నియోజకవర్గాలకు వరుపుల రాజా ఇంచార్జీగా వ్యవహరిస్తున్నారు. శనివారం మధ్యాహ్నం వరకు గ్రాడ్యుయేట్స్ ఎన్నికల విషయమై పార్టీ నేతలతో రాజా సమావేశాలు నిర్వహించారు. గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు.

Also REad: టీడీపీ నేత వరుపుల రాజా గుండెపోటుతో మృతి

అనంతరం శనివారం సాయంత్రం ఆయన ప్రత్తిపాడుకు చేరుకున్నారు. ప్రత్తిపాడు లో పార్టీ నాయకులు , కుటుంబ సభ్యులు, బంధువులతో రాత్రి 9 గంటల వరకు రాజా గడిపారు. అదే సమయంలో తనకు గుండెలో నొప్పిగా ఉందని కుటుంబ సభ్యులకు చెప్పారు. దీంతో వరుపుల రాజాను కుటుంబ సభ్యులు కాకినాడలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. ఆసుపత్రిలో వైద్యులు చికిత్స నిర్వహిస్తున్న సమయంలో రాజా మృతి చెందారు. గతంలో కూడా రాజాకు రెండు దఫాలు గుండెపోట్లు వచ్చాయి. దీంతో ఆయనకు వైద్యులు స్టంట్లు వేశారు.

ఇకపోతే.. వరుపుల రాజా వయస్సు 47 ఏళ్లు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా డీసీసీబీ చైర్మెన్ గా, అప్కాబ్ వైఎస్ చైర్మన్ గా సేవలందించారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో రాజా టీడీపీ అభ్యర్ధిగా ప్రత్తిపాడు నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ప్రత్తిపాడు ఎంపీపీగా రాజా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఆయన అకాల మరణంతో తెలుగుదేశం నేతలు, శ్రేణులు దిగ్భ్రాంతికి గురయ్యాయి. ఇటీవల ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు హఠాన్మరణం నుంచి తేరుకోకముందే మరో సీనియర్ నేత వరుపుల రాజా కూడా కన్నుమూయడంతో టీడీపీ శ్రేణులు శోకసంద్రంలో మునిగిపోయాయి.