గుంటూరు జిల్లా పెదకాకాని మండలం ఉప్పలపాడులో ఎన్టీఆర్ విగ్రహానికి చెప్పులు కట్టిన ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విగ్రహాల తొలగింపు వంటి చర్యలకు ప్రభుత్వమే పాల్పడుతోందని ఆయన ఆరోపించారు.  

గుంటూరు జిల్లా పెదకాకాని మండలం ఉప్పలపాడులో ఎన్టీఆర్ విగ్రహానికి చెప్పులు కట్టిన ఘటన తీవ్ర కలకలం రేపుతోన్న సంగతి తెలిసిందే. ఈ ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. మహనీయులను గౌరవించే సంస్కృతి వైసీపీకి తొలి నుంచి లేదంటూ ఆయన దుయ్యబట్టారు. సంస్థలకు వున్న నేతల పేర్ల మార్పు.. విగ్రహాల తొలగింపు వంటి చర్యలకు ప్రభుత్వమే పాల్పడుతోందని చంద్రబాబు ఆరోపించారు. దీంతో ఆ పార్టీ కేడర్ కూడా అదే బాటలో పయనిస్తోందని టీడీపీ చీఫ్ దుయ్యబట్టారు. ఇకనైనా ప్రభుత్వం తన వైఖరి మార్చుకోవాలని.. దీనితో పాటు ఇలాంటి తప్పుడు పనులు చేస్తున్న వారి పట్ల కఠినంగా వుండాలని జగన్ ప్రభుత్వాన్ని చంద్రబాబు డిమాండ్ చేశారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

అంతకుముందు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కూడా ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని తక్షణం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. వైసీపీ అధికాంలోకి వచ్చాక ఎన్టీఆర్‌కు ఎన్నో అవమానాలు జరిగాయని అచ్చెన్నాయుడు ఫైర్ అయ్యారు. ఎన్టీఆర్ విగ్రహాలకు గతంలో నిప్పుపెట్టడంతో పాటు పట్టపగలే దాడి చేశారని.. వారిపై ఆనాడే కఠినంగా చర్యలు తీసుకుని వుంటే ఈరోజు ఈ ఘటన జరిగేది కాదన్నారు. హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తొలగించిన తర్వాత కొందరు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారని అచ్చెన్నాయుడు ఫైర్ అయ్యారు. ఇలాంటి ఘటనలు పునరావృతమైతే తమ స్పందన మరోలా వుంటుందని ఆయన హెచ్చరించారు. 

ALso REad:ఎన్టీఆర్ విగ్రహానికి చెప్పులు.. చర్యలు తీసుకోండి : వైసీపీ ప్రభుత్వానికి అచ్చెన్నాయుడు అల్టీమేటం

ఇకపోతే.. గతవారం ఎన్టీఆర్ జిల్లా నందిగామలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రోడ్ షోపై కొందరు దుండగులు రాళ్ల దాడికి పాల్పడిన ఘటనపై అచ్చెన్నాయుడు స్పందించారు. చంద్రబాబు నాయుడు కాన్వాయ్ పై రాళ్ల దాడి వైసీపీ రౌడీ రాజకీయానికి పరాకాష్ట అన్నారు. చంద్రబాబు సభలకు వస్తున్న ప్రజా స్పందన చూసి ఏసీలో ఉండి కూడా జగన్ రెడ్డికి చెమటలు పడుతున్నాయని అచ్చెన్నాయుడు సెటైర్లు వేశారు. 

ఒక పార్టీ జాతీయ అధ్యక్షునిపై దాడి చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. రౌడీ రాజకీయాలతో మమ్మల్ని భయపెట్టాలనుకోవడం పగటి కల అని జగన్‌పై ఘాటు విమర్శలు చేశారు అచ్చెన్నాయుడు. చంద్రబాబు నాయుడు కనుసైగ చేస్తే మా కార్యకర్తల చేతిలో వైసీపీ గుండాల పరిస్థితి ఏంటి అని ఆయన హెచ్చరించారు. అధికారం ఉంది కదా అని బరి తెగిస్తే బడితే పూజ తప్పదని అచ్చెన్నాయుడు హితవు పలికారు. దాడి చేసిన వారిని, దాడి చేయించిన వారిని వెంటనే అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

Scroll to load tweet…