ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై సోషల్ మీడియా వేదికన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శల వర్షం కురిపించారు. 

గుంటూరు: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శల వర్షం కురిపించారు. ఎన్నికల సమయంలో ఇదే కోతలరాయుడు ప్రజలకు ఎన్నో హామీలిచ్చాడని... ఇప్పుడు వాటిని విస్మరించడమే కాకుండా ప్రజలపై భారం మోపుతున్నాడంటూ సీఎంను విమర్శించారు. కేవలం ఏడాది పాలనకే ప్రజలు బెంబేలెత్తిపోతున్నారంటూ చంద్రబాబు ట్విట్టర్ వేదికన విరుచుకుపడ్డారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

''వెనకటికి ఒక కోతలరాయుడు శుక్రవారం రోజున కొండను మోస్తానని జనాన్ని నమ్మించాడంట. నిజమే అనుకుని ఆరోజు కొండ దగ్గరికి ప్రజలంతా వెళ్తే, కోతలరాయుడు వచ్చి... "మీరంతా కొండను ఎత్తి నా భుజాల మీద పెట్టండి. నేను మోస్తాను." అన్నాడంట'' అంటూ సీఎం జగన్ పై పరోక్షంగా సెటైర్లు విసిరారు.

''ఏపీలో కోతలరాయుని పాలన కూడా అలాగే ఉంది. ముద్దులు పెట్టి, ఏది కావాలంటే అది ఇస్తానని ప్రజలను నమ్మించారు. తీరా అధికారంలోకి వచ్చాక, ఆదాయం కోసం జనాన్ని ధరల బరువు మోయమంటున్నారు. ఏడాది కాలంలో కోతలరాయుని ధరాఘాతాలకు ప్రజలు బెంబేలెత్తి పోతున్నారు'' అని అన్నారు.

''పాలనకు, హామీల అమలుకు అవసరమైన సంపదను ప్రభుత్వం సృష్టించుకోవాలి. అంతేకానీ ధరలు పెంచేసి ప్రజలను పీడించడం ఏంటి? ఇదేం చేతకాని పాలన?'' అంటూ వరుస ట్వీట్ల ద్వారా జగన్ పై మండిపడ్డారు చంద్రబాబు. 

read more నేతి బీరకాయలో నెయ్యి ఎంతో... జగన్ మాటల్లో నీతీ అంతే: బుచ్చయ్యచౌదరి సెటైర్లు

అంతకు ముందు మాన్సాస్ ట్రస్ట్ కు సంబంధించిన వివాదంపైనా చంద్రబాబు స్పందించారు. ''మాన్సాస్ ట్రస్ట్ అన్నది ఒక ఉన్నతమైన లక్ష్యాలతో పూసపాటి వంశీయులు స్థాపించిన సంస్థ. ఆ సంస్థ కింద 105 దేవాలయాలతో పాటు, ఎన్నో విద్యాలయాలు ఉన్నాయి. సంస్థకున్న పవిత్ర ఆశయాలను దృష్టిలో పెట్టుకుని తెలుగుదేశంతో సహా ఏ పార్టీ అధికారంలో ఉన్నా సంస్థ విషయాల్లో జోక్యం చేసుకోలేదు'' అన్నారు.

''అలాంటిది రూ.1 లక్షా 30 వేల కోట్లకు పైగా విలువజేసే ట్రస్ట్ భూముల మీద కన్నేసి, కాజేయడానికి వైసీపీ పెద్దలు అధికార దుర్వినియోగం చేస్తున్నారు. తండ్రి ఆశయాలను బతికించుకోవటానికి అశోక గజపతి రాజు తపన పడుతున్నారు. ఆయనకు అందరూ అండగా నిలవాలి. ఒక పవిత్ర సంకల్పాన్ని బతికించాలి'' అంటూ చంద్రబాబు ట్విట్టర్ ద్వారా పిలుపునిచ్చారు.