23ఏళ్ళ వయసులోనే పైలట్... రంగారెడ్డి గొప్పతనం ఇదీ..: చంద్రబాబు
నెల్లూరు జిల్లాలో జమిందారీ కుటుంబంలో జన్మించి భారతీయ వైమానిక దళం పట్ల ఆసక్తితో ఆ విభాగంలో అధికారిగా చేరి, ఆంగ్లేయ సైన్యంతో కలిసి యుద్ధం చేస్తూ శత్రు విమానాన్ని పడగొట్టిన మొదటి భారతీయ పైలట్ రంగారెడ్డి గుర్తింపు పొందారని టిడిపి చీఫ్ చంద్రబాబు ట్వీట్ చేేశారు.
గుంటూరు: స్వాతంత్య్రానికి ముందే పైలట్ గా వైమానిక దళంలో పరిచేసి... శత్రువులను గడగడలాడించిన దొడ్ల రంగారెడ్డి తెలుగువాడు కావడం గర్వకారణమని మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఇలా తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడిన పొట్టి శ్రీరాములుతో పాటు రంగారెడ్డి వంటి గొప్ప నాయకులు నెల్లూరు జిల్లాకే చెందిన వారని... తెలుగునేలకు ఇలాంటి గొప్ప వ్యక్తులను అందించిన ఘనత ఈ జిల్లాదని కొనియాడారు.
''తెలుగువారి శౌర్యానికి నిలువెత్తు నిదర్శనం దొడ్ల రంగారెడ్డిగారు. నెల్లూరు జిల్లాలో జమిందారీ కుటుంబంలో జన్మించి భారతీయ వైమానిక దళం పట్ల ఆసక్తితో ఆ విభాగంలో అధికారిగా చేరి, ఆంగ్లేయ సైన్యంతో కలిసి యుద్ధం చేస్తూ శత్రు విమానాన్ని పడగొట్టిన మొదటి భారతీయ పైలట్ రంగారెడ్డి'' అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.
''అదే యుద్ధంలో 1944 ఫిబ్రవరి 8న తన సహచరులను శత్రుదాడుల నుంచి రక్షించి తాను అమరులయ్యారు రంగారెడ్డి. అప్పటికి ఆయనకు కేవలం 23 ఏళ్ళ వయసు. విధి నిర్వహణలో అంకితభావం, స్వార్థరహిత మానవత్వానికి ప్రతీక అయిన దొడ్ల రంగారెడ్డి వర్ధంతి సందర్భంగా ఆ వీరుని స్మృతికి నివాళులర్పిస్తున్నాను''అన్నారు.
''పొట్టి శ్రీరాములు నుండి దొడ్ల రంగారెడ్డి వంటి వారి వరకు ఎందరో త్యాగధనులను తెలుగునేలకు అందించింది నెల్లూరు నేల. ఆ వీరుల స్ఫూర్తిగా ఉద్యమించి తెలుగువారి హక్కులను, ఆత్మగౌరవాన్ని కాపాడుకుందాం'' అని చంద్రబాబు సూచించారు.