ఫేక్ సర్టిఫికేట్ ఆరోపణలపై స్పందించిన స్పీకర్ తమ్మినేని.. ఏమన్నారంటే..
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం విద్యార్హతపై టీడీపీ నేత కూన రవికుమార్ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలపై స్పీకర్ తమ్మినేని సీతారాం తాజాగా స్పందించారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం విద్యార్హతపై టీడీపీ నేత కూన రవికుమార్ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే . డిగ్రీ పాస్ కాకుండా బీఎల్ లా కోర్సులో ఎలా చేరారని స్పీకర్ తమ్మినేనిని ఆయన ప్రశ్నించారు. అయితే ఈ ఆరోపణలపై స్పీకర్ తమ్మినేని సీతారాం తాజాగా స్పందించారు. సరైన సమయంలో సరైన సమాధానం చెబుతానని అన్నారు. ఎవరెవరూ ఏం చెబుతారో చెప్పనివ్వండని అన్నారు. అన్నింటికి ఒకేసారి వివరణ ఇస్తామని చెప్పారు. తనపై గవర్నర్కు, ఇతర ముఖ్యులకు ఫిర్యాదు చేస్తామంటున్న వారికి ఆ హక్కు ఉందని అన్నారు. వారు ఎవరికైనా ఫిర్యాదు చేసుకోవచ్చని అన్నారు. తాను తప్పు చేయనప్పుడు.. తనకు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. సరైన సమయంలో వివరణ ఇస్తానని పేర్కొన్నారు.
తప్పుడు డిగ్రీ సర్టిఫికేట్తో తమ్మినేని సీతారం న్యాయవిద్యకు సంబంధించి మూడేళ్ల కోర్సులో చేరినట్టు టీడీపీ నేత కూన రవికుమార్ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. రాజ్యాంగబద్ధ పదవిలో వుండి డిగ్రీ పూర్తి చేయకుండా ఎలా సర్టిఫికేట్ పెట్టారని రవికుమార్ ప్రశ్నించారు. సర్టిఫికెట్ ఫోర్జరీ చేసుంటారనే అనుమానం వ్యక్తం చేశారు. తమ్మినేని సీతారాం స్పీకర్ పదవికి తక్షణం రాజీనామా చేయాలని రవికుమార్ డిమాండ్ చేశారు.
దీనిపై రాష్ట్రపతి, సీజేఐ, గవర్నర్కు ఫిర్యాదు చేస్తామని అన్నారు. సీఐడీ విచారణ జరిపించాల్సిందిగా సీఎం జగన్కు లేఖ రాస్తామని రవికుమార్ పేర్కొన్నారు. రాజకీయాల్లో రాజ్యాంగ విలువలు, నైతికతను కాపాడేందుకు, నిజాయితీని నిరూపించుకునేందుకు తమ్మనేని సీతారాం తన స్పీకర్ పదవికి స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.