తిరుపతిలోని ఓ లాడ్జిలో కర్ణాటకకు చెందిన ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మరణించాడు. అతనితో ఉన్న మహిళ కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

తిరుపతి : కర్ణాటకలోని కోలార్ జిల్లా ముళబాగల్‌కు చెందిన 30 ఏళ్ల వ్యక్తి తిరుపతిలోని ఓ ప్రైవేట్ లాడ్జిలో బుధవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతుడు ఎన్ వినోద్ కుమార్‌గా గుర్తించారు. వినోద్‌కుమార్‌ మంగళవారం ఓ మహిళతో కలిసి ఓ ప్రైవేట్‌ లాడ్జిలో దిగాడు.

బుధవారం ఉదయం రూం బాయ్‌లు ఎన్నిసార్లు తలుపు తట్టినా వినోద్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో అనుమానం వచ్చి స్థానిక పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసుల సమక్షంలో గది తలుపులు పగులగొట్టి చూడగా వినోద్ కుమార్ మృతదేహం పైకప్పుకు వేలాడుతూ కనిపించింది.
తిరుపతి తూర్పు పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎస్వీఆర్‌ఆర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు. వినోద్‌కుమార్‌తో కలిసి ఉన్న మహిళ కోసం పోలీసులు వేట ప్రారంభించారు.