Asianet News TeluguAsianet News Telugu

పంచాయితీ భవనాలకు వైసిపి రంగులు... సుప్రీంకోర్టులోనూ ప్రభుత్వానికి చుక్కెదురు

ఆంధ్ర ప్రదేశ్  ప్రభుత్వంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులు వేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది అత్యున్నత న్యాయస్థానం. 

supremecourt fumes on YSRCP govt over painting the govt building in party colours
Author
Amaravathi, First Published Mar 23, 2020, 2:49 PM IST

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంపై దేశ అత్యున్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పంచాయతీ భవనాలకు వైసీపీ జెండా రంగులు వేయడాన్ని హైకోర్టు తప్పుబట్టడంతో జగన్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ  పిటిషన్ పై సోమవారం విచారణ జరిపిన న్యాయస్థానం వైసిపి ప్రభుత్వం తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 

ఈ పిటిషన్ విచారణ  జరిపిన సుప్రీంకోర్టు ప్రధాన  న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ప్రభుత్వం ఏపి హైకోర్టు ఆదేశాలను సమర్ధించింది. విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ భవనాలకు కాషాయ రంగు వేస్తే ఒప్పుకుంటారా? అంటూ న్యాయమూర్తి ప్రభుత్వం తరపు న్యాయవాదిని ప్రశ్నించారు. కాబట్టి ఇలాంటి చర్యలను సమర్ధించబోమని... వెంటనే హైకోర్టు తీర్పును అమలుచేసి తీరాలని ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ పిటిషన్  కొట్టివేసింది అత్యున్నత న్యాయస్థానం. 

 పంచాయతీ రాజ్ కార్యాలయాలపై వైసిపి రంగులు వేయడంపై ఇదివరకు హైకోర్టు మండిపడింది. పంచాయతీ కార్యాలయాలకు వేసిన రంగులపై ప్రభుత్వ తీరును హైకోర్టు ఆక్షేపించింది.  ముఖ్యంగా పంచాయతీ కార్యాలయపై సీఎం ఫొటో ఎందుకు ముద్రించారని హైకోర్టు ప్రశ్నిస్తే రాజ్యాంగబద్దమైన పదవిలో ఉన్నారు కాబట్టి ముద్రించినట్లు ప్రభుత్వం తరఫు న్యాయవాది చెప్పారు. దీనిపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కావాలంటే కార్యాలయం లోపల సీఎం ఫొటో పెట్టుకోవచ్చునని హైకోర్టు చెప్పింది.

 పార్లమెంటుపై ప్రధాని ఫొటోను, సుప్రీంకోర్టుపై ప్రధాన న్యాయమూర్తి ఫొటోను ముద్రించారా అని హైకోర్టు ప్రశ్నించింది. ఇలాంటి సంప్రదాయం ఎక్కడుందో చెప్పాలని నిలదీసింది.  వైసీపీ రంగులు వేరు, కార్యాయాలకు వేసిన రంగులు వేరని ప్రభుత్వం తరఫు న్యాయవాది చెప్పగా తాము వాటిని పోల్చుకోగలమని వ్యాఖ్యానించింది. అదే సమయంలో టీడీపీ, వైసీపీ జెండాలను తమకు సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది.

ఇలా ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులను తొలగించాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ జగన్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లగా అక్కడ కూడా చుక్కుదుకయ్యింది. దీంతో వైసిపి ప్రభుత్వం పార్టీ రంగుల విషయంలో వెనక్కితగ్గాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది. 
 

  


 

  

Follow Us:
Download App:
  • android
  • ios