రాజధాని అమరావతి కేసు.. రైతుల పిటిషన్పై మే 9న సుప్రీంలో విచారణ..
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అంశం కేసుకు సంబంధించి చనిపోయిన పిటిషనర్స్ స్థానంలో వేరొకరికి అవకాశం ఇవ్వాలంటూ రైతులు ఎల్ఆర్ ఆప్లికేషన్ దాఖలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అంశంపై సుప్రీంకోర్టులో జూలై 11న విచారణ జరగనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ కేసుకు సంబంధించి చనిపోయిన పిటిషనర్స్ స్థానంలో వేరొకరికి అవకాశం ఇవ్వాలంటూ రైతులు ఎల్ఆర్ ఆప్లికేషన్ దాఖలు చేశారు. ఇందుకు సంబంధించి మే 9న సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. రైతులు పిటిషన్పై జస్టిస్ జోసెఫ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం కేసును విచారించనుంది.
ఇదిలా ఉంటే..అమరావతి రాజధానిపై ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. అలాగే అమరావతి రాజధాని అంశంపై ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్లను త్వరగా విచారించాలని సుప్రీంకోర్టును ఏపీ ప్రభుత్వ న్యాయవాదులు కోరారు. అయితే ఏపీ సర్కార్ అభ్యర్ధనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. వేసవి సెలవుల తర్వాత ఈ పిటిషన్లపై విచారణ చేస్తామని సుప్రీంకోర్టు ధర్మాసనం ఏపీ ప్రభుత్వ న్యాయవాదులకు తెలిపింది.
అంతకంటే ముందుగానే ఈ పిటిషన్లపై విచారణ చేయాలని ఏపీ ప్రభుత్వ తరపు న్యాయవాదులు కోరారు. అయితే అందుకు సుప్రీంకోర్టు ధర్మాసనం మాత్రం అంగీకరించలేదు. జూలై 11న ఈ పిటిషన్లపై తొలుత విచారణ చేపడుతామని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది.