టీడీపీకి షాక్: జనసేనలోకి టీడీపీ కీలకనేత
తనను ప్రజలకు దూరం చేశారనే మనోవేదనతో టీడీపీకి రాజీనామా చేస్తున్నట్టు ఆ పార్టీ నేత సుందరపు విజయ్కుమార్ చెప్పారు.
విశాఖపట్టణం: తనను ప్రజలకు దూరం చేశారనే మనోవేదనతో టీడీపీకి రాజీనామా చేస్తున్నట్టు ఆ పార్టీ నేత సుందరపు విజయ్కుమార్ చెప్పారు. అక్టోబర్ 19వ తేదీన జనసేనలో చేరుతున్నట్టు ఆయన ప్రకటించారు.
2011లో చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు విశాఖ జిల్లా ఎలమంచిలి నియోజకవర్గ పార్టీ బాధ్యతలు స్వీకరించినట్టు ఆయన గుర్తు చేసుకొన్నారు. ఆదివారం సాయంత్రం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడారు. తాను బాధ్యతలు చేపట్టిన తర్వాత పార్టీని బలోపేతం చేసినట్టు చెప్పారు. అంతేకాదు పార్టీ కార్యకర్తల్లో మనోధైర్యం కల్పించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
అదే సమయంలో వచ్చిన స్థానిక సంస్థల ఎన్నికల్లో 91 గ్రామ పంచాయితీల్లో 41 గ్రామ పంచాయితీలను టీడీపీ కైవసం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించినట్టు ఆయన చెప్పారు. 2014 ఎన్నికల్లో తనకు టీడీపీ టిక్కెట్టు ఇవ్వకపోయినా.. పార్టీ చీఫ్ చంద్రబాబునాయుడు సూచన మేరకు పార్టీ అభ్యర్థి గెలుపు కోసం తాను కృషి చేశానన్నారు.
తనకు న్యాయం చేస్తానని చంద్రబాబునాయుడు, లోకేష్ ఇచ్చిన హమీలను అమలు చేయలేదన్నారు. దీంతో తాను టీడీపీని వీడాలని నిర్ణయం తీసుకొన్నట్టు ఆయన చెప్పారు. అనుచరులతో కలిసి ఈ నెల 19వ తేదీన జనసేనలో చేరుతున్నట్టు విజయ్కుమార్ ప్రకటించారు.