ప్రత్యూష భూముల వ్యవహారంలో స్టేటస్ కో... ఏపీ హైకోర్టు ఆదేశాలు
విశాఖ జిల్లాలో తమకు చెందిన భూమి విషయంలో రెవెన్యూ అధికారుల జోక్యాన్ని నిలువరించాలని కోరుతూ ప్రత్యూష రిసోర్సెస్ అండ్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ హైకోర్టును ఆశ్రయించింది.
అమరావతి: విశాఖపట్నంలోని అడివివరం - శొంఠ్యాం రహదారిలోని విజయరాంపురం అగ్రహారంలో ప్రత్యూష ఇన్ ఫ్రా సంస్థకు చెందిన 484 ఎకరాల విషయంలో యధాతథస్థితిని పాటించాలని అధికారులను హైకోర్టు ఆదేశించింది. ఈ వ్యవహారంపై కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది న్యాయస్థానం.
విజయరాంపురం అగ్రహారంలో తమకు చెందిన భూమి విషయంలో రెవెన్యూ అధికారుల జోక్యాన్ని నిలువరించాలని కోరుతూ ప్రత్యూష రిసోర్సెస్ అండ్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ ఆధీకృత అధికారి పీవీ ప్రభాకర్ ఆదివారం అత్యవసరంగా హైకోర్టులో హౌజ్మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.కృష్ణమోహన్ ప్రత్యూష ఇన్ ఫ్రా సంస్థకు చెందిన 484 ఎకరాల విషయంలో స్టేటస్ కో పాటించాలంటూ మధ్యంతర ఉత్తర్వులిచ్చారు.