ఆరు నెలల క్రితం పెళ్లి.. శ్రీకాకుళం జవాను వీర మరణం
అరుణాచల్ ప్రదేశ్ ఖోన్సా సరిహద్దు సమీపంలో ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పల్లో బాబూరావు మరణించినట్లు అధికారులు వెల్లడించారని కుటుంబసభ్యులు తెలిపారు
ఆరు నెలల క్రితమే పెళ్లి బంధంలోకి అడుగుపెట్టాడు. భార్యతో సరిగా నెల రోజులు కూడా గడపలేదు. అంతలోనే..సరిహద్దుల్లో దేశం కోసం పోరాడి ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాదకర సంఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరుకు చెందిన అసోం రైఫిల్స్ జవాను బొంగు బాబూరావు(28) ఎదురు కాల్పుల్లో వీరమరణం పొందారు. అరుణాచల్ ప్రదేశ్ ఖోన్సా సరిహద్దు సమీపంలో ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పల్లో బాబూరావు మరణించినట్లు అధికారులు వెల్లడించారని కుటుంబసభ్యులు తెలిపారు.
గురువారం మధ్యాహ్నం 1.40 గంటలకు జవాను భౌతికకాయం విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకుంది. కాశీబుగ్గ దరి తాళభద్ర నుంచి అక్కుపల్లి మీదుగా స్థానిక యువకులు ద్విచక్ర వాహన ర్యాలీతో సాయంత్రం స్వగ్రామానికి తీసుకువచ్చారు. బాబూరావు కు ఈ ఏడాది ఫిబ్రవరిలోనే వివాహమైంది. గత నెల చివర్లో విధుల్లోకి వెళ్లి 21 రోజులు క్వారంటైన్ లో ఉన్నారు. తిరిగి విధుల్లో చేరిన మూడు రోజులకే అమరుడయ్యారు. శుక్రవారం ఉదయం సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు స్థానిక ఎస్ఐ గోవిందరావు తెలిపారు.