సారాంశం
ఒంగోలు జిల్లా రాజాపానగల్ యూనియన్ బ్యాంకు వద్ద విధులు నిర్వహిస్తున్న ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు తుపాకీ చేతిలో తుపాకీ పేలింది. ఈ ప్రమాదంలో వెంకటేశ్వర్లు మృతి చెందాడు.
ఒంగోలు: జిల్లాలోని రాజా పానగల్ యూనియన్ బ్యాంకు కరెన్సీ టెస్టింగ్ సెంటర్ లో ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు తుపాకీ పేలి మృతి చెందాడు. తుపాకీ ప్రమాదవశాత్తు పేలిందా , వెంకటేశ్వర్లు ఆత్మహత్య చేసుకున్నాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సోమవారంనాడు మధ్యాహ్నం బ్యాంకు వద్ద వెంకటేశ్వర్లు విధుల్లో ఉన్న సమయంలో ఈ ఘటన జరిగింది. బ్యాంకు సిబ్బంది విధుల్లో ఉన్న సమయంలో పెద్ద శబ్దం చేస్తూ తుపాకీ పేలింది. తుపాకీ పేలడానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
గతంలో కూడ గన్ మిస్ ఫైర్ కానిస్టేబుళ్లు మృతి చెందిన ఘటనలు తెలుగు రాష్ట్రాల్లో చోటు చేసుకున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని కౌటాల పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న పోలీస్ కానిస్టేబుల్ చేతిలో తుపాకీ మిస్ ఫైర్ అయింది. ఈ ఘటనలో రజని కుమార్ అనే కానిస్టేబుల్ మృతి చెందాడు. ఈ ఘటన గత ఏడాది నవంబర్ లో చోటు చేసుకుంది.
వరంగల్ జిల్లాకు చెందిన బి. సంతోష్ యాదవ్ అనే కానిస్టేబుల్ భద్రాద్రి కొత్తతూడెం జిల్లా కొమరారం పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్నాడు. తోటి కానిస్టేబుళ్లతో సంతోష్ యాదవ్ డ్రిల్ నిర్వహిస్తున్న సమయంలో సంతోష్ చేతిలో గన్ మిస్ ఫైర్ అయింది. దీంతో సంతోష్ కు బుల్లెట్ గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు.ఈ ఘటన 2022 ఫిబ్రవరి 13న జరిగింది.
ఏపీఎస్పీ రెండో బెటాలియన్ కానిస్టేబుల్ గన్ మిస్ ఫైర్ అయి మృతి చెందాడు. ఈ ఘటన 2020 సెప్టెంబర్ 11న జరిగింది.గన్ ను క్లీన్ చేస్తున్న సమయంలో గన్ మిస్ ఫైర్ అయింది. ఈ ప్రమాదంలో రాజు అనే కానిస్టేబుల్ మృతి చెందాడు.2020 నవంబర్ 01వ తేదీన గన్ మిస్ ఫైర్ అయి ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ మృతి చెందాడు.ఈ ఘటన హైద్రాబాద్ రాణిగంజ్ వద్ద బ్యాంకు వద్ద చోటు చేసుకుంది.