Asianet News TeluguAsianet News Telugu

మచిలీపట్నలో దారుణం... కన్న తల్లిని క్రికెట్ బ్యాట్ తో కొట్టిచంపిన కసాయి కొడుకు

పెళ్లి కోసం కన్న తల్లినే అతికిరాతంగా కొట్టిచంపాడో కసాయి కొడుకు. ఈ దారుణం కృష్ణా జిల్లా మచిలీపట్నంలో చోటుచేసుకుంది.

son kills his own mother at machilipatnam
Author
Machilipatnam, First Published Nov 26, 2021, 2:20 PM IST

మచిలీపట్నం: నవమాసాలు కడుపున మోసి జన్మనిచ్చిన తల్లినే అతి కిరాతకంగా హతమార్చాడో కసాయి కొడుకు. పెళ్లి చేయాలంటూ తల్లితో గొడవపడ్డ తనయుడు ఆవేశంలో తల్లిపై క్రికెట్ బ్యాట్ తో దాడిచేసి హతమార్చాడు. ఈ దారుణం కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే... krishna district ప్రధాన కేంద్రం మచిలీపట్నం పరాస్ పేటలోని శ్రీచైతన్య టెక్నో స్కూల్ సమీపంలో చింతరాజు - వెంకటేశ్వరమ్మ దంపతులు కొడుకు హరీష్ రావుతో కలిసి నివాసముటున్నారు. అయితే హరీష్ తనకు పెళ్లి చేయాలంటూ తల్లిదండ్రులను ఒత్తిడి చేయడంతో వారు సంబంధాలు చూస్తున్నారు. బంధువులతో పాటు తెలిసినవారి ద్వారా చాలా సంబంధాలు వచ్చాయి. కానీ ఏ సంబంధమూ పెళ్లివరకు వెళ్లలేదు. 

కొంతకాలంగా ఇలాగే సంబంధాలు రావడం... పెళ్లి కుదరకపోవడంతో హరీష్ డిప్రెషన్ కు గురయ్యాడు. దీంతో తరచూ తల్లిదండ్రులతో గొడవపడుతుండేవాడు. ఈ క్రమంలోనే తల్లీ కొడుకుల మధ్య గురువారం మరోసారి పెళ్లి విషయంలో మాటామాటా పెరిగింది. దీంతో కోపోద్రిక్తుడైన హరీష్ క్షణికావేశంలో విచక్షణ కోల్పోయి కన్నతల్లిపైనే క్రికెట్ బ్యాట్ తో దాడిచేసాడు. 

read more  కడపలో ఫారెస్ట్ అధికారులపై తమిళ కూలీల దాడి: పారిపోతూ ఒకరి మృతి, ఇధ్దరికి గాయాలు

వెంకటేశ్వరమ్మ తలపై కొడుకు బలంగా కొట్టడంతో తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. దీంతో భయపడిపోయిన హరీష్ తల్లిని అలాగే వదిలేని ఇంటితలుపులు మూసేసి పరారయ్యాడు. ఈ ఘటన తర్వాత చాలాసేపటికి ఇంటికి వచ్చిన చింతరాజు తలుపుతెరిచి చూడగా భార్య రక్తపుమడుగులో పడివుంది. దీంతో అతడు భార్యను చికిత్స నిమిత్తం బందరు ప్రభుత్వాస్పత్రికి తరలించాడు. అయితే అప్పటికే ఆమె మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

ఈ దారుణం గురించి సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఆసుపత్రికి వెళ్లి వివరాలు సేకరించారు. చింత రాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం తల్లిని చంపిన నిందితుడు పరారీలో వుండగా అతడికోసం పోలీసులు గాలిస్తున్నారు.

read more  హైదరాబాద్ శివారులో దారుణం... వృద్దురాలిపై ఇద్దరు దుండగుల అత్యాచారం, హత్య

మానవ సంబంధాలు, కుటుంబ విలువలకు మచ్చలాంటి ఈ సంఘటన మచిలీపట్నంలో సంచలనంగా మారింది. కేవలం పెళ్లి కోసం కనిపెంచిన తల్లిని చంపిన కసాయిపై స్థానికులు విరుచుకుపడుతున్నారు. ఈ కసాయి  కొడుకును కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇదిలావుంటే నల్గొండ జిల్లాలో ఇలాంటి దారుణమే ఇటీవల జరిగింది. ఓ తనయుడు ఆస్తి విషయంలో గొడవపడి తల్లిని అతి కిరాతకంగా హతమార్చాడు. దండెంపల్లి గ్రామానికి చెందిన సుంకరబోయిన యాదమ్మ(55),ఆమె భర్త గంగయ్య దంపతులకు ఇద్దరు సంతానం. కుమార్తె కళావతిని తన సోదరుడు శ్రీనుకి ఇచ్చి వివాహం జరిపించింది యాదమ్మ. కొడుకు యాదగిరికి కూడా పెళ్లి కాగా భార్యభర్తలు విడిపోయారు.  

అయితే కుటుంబసభ్యుల మధ్య ఆస్తి విషయంలో వివాదాలు జరిగాయి.  ఈ క్రమంలో కుమారుడు యాదగిరి ఇటీవల తమ ఇంట్లో కూర్చొని ఆస్తులు, అప్పుల గురించి మాట్లాడుకుంటున్నారు. ఆ సమయంలో  యాదమ్మ తన ఆస్తి విషయంలో తన సోదరుడు శ్రీను సలహా తీసుకుంటానని.. అతను చెప్పినట్లే చేస్తానని చెప్పింది. ఈ విషయంలో వారి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో ఆవేశానికి గురైన యాదగిరి తల్లి యాదమ్మను అతి కిరాతకంగా హత్య చేశాడు.  
 

Follow Us:
Download App:
  • android
  • ios