తెలుగుదేశం పార్టీతో పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.  అమిత్ షాను చంద్రబాబు కలిసినంత మాత్రాన అన్నీ ఊహించుకుంటారా అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 

టీడీపీ పొత్తు, ఏపీలో జరుగుతున్న పరిణామాలపై స్పందించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నాలుగేళ్లలో వైసీపీ ప్రభుత్వం ప్రజలకు ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. టీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకుందని వెరు చెప్పారని వీర్రాజు ప్రశ్నించారు. అమిత్ షాను చంద్రబాబు కలిసినంత మాత్రాన అన్నీ ఊహించుకుంటారా అని ఆయన నిలదీశారు. అమిత్ షాతో భేటీ తర్వాత దానిపై చంద్రబాబు ఎక్కడా మాట్లాడలేదని.. కానీ వారిద్దరి మధ్య భేటీని ఎవరికి ఇష్టమొచ్చినట్లు వారు ఊహించుకుంటున్నారని సోము వీర్రాజు దుయ్యబట్టారు. రాష్ట్రానికి డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలనేది తన ఆకాంక్ష అని ఆయన స్పష్టం చేశారు. 

వైసీపీతో తాము ఎప్పుడూ లేమని.. జగన్ ప్రభుత్వ అవినీతిపై పోరాడుతున్నామని సోము వీర్రాజు వెల్లడించారు. ప్రజల్లోకి వెళ్లేందుకు తాము చేపట్టిన కార్యక్రమాలకు విశేష స్పందన లభిస్తోందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో పరిణామాలు మారాయని , రాబోయే రోజుల్లో మరింత మారుతాయని సోము వీర్రాజు పేర్కొన్నారు. పవన్ - ముద్రగడ గొడవను కులపరమైన గొడవగా తాము భావించడం లేదని సోము వీర్రాజు స్పష్టం చేశారు.