ఇదో విచిత్రమైన కేసు.. ఇద్దరు బాల్య స్నేహితులు వివాహేతర సంబంధాల కారణంగా బద్ద శత్రువులుగా మారి.. ఒకరినొకరు హతమార్చుకునేవరకు దిగజారారు. క్రిష్ణాజిల్లాలో సంచలనం రేపిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ హత్య కేసు వివరాలు ఇవి.. 

కృష్ణాజిల్లా : తొట్లవల్లూరు లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ హత్యకు వివాహేతర సంబంధమే కారణం అని పోలీసులు తేల్చారు. పథకం ప్రకారం పిలిపించి.. స్నేహితుడే హతమార్చాడని పమిడిముక్కల సీఐ ముక్తేశ్వరరావు, తొట్లవల్లూరు ఎస్సై వై. అర్జున్ తెలిపారు. నిందితులను సోమవారం అరెస్టు చేశారు. సంచలనం రేకెత్తించిన యువ ఇంజినీరు హత్యకు సంబంధించి... దర్యాప్తులో తెలిసిన ఆసక్తికర విషయాలను తోట్లవల్లూరు ఠాణాలో పోలీసులు వెల్లడించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

ఫోన్ అప్ డేట్ చేస్తూ... 
హతుడు గాడికొయ్య శ్రీనివాసరెడ్డి (38), నిందితుడు ఆళ్ల శ్రీకాంత్ రెడ్డి బాల్య స్నేహితులు. తోట్లవల్లూరు మండలం అల్లవారిపాలెంకు చెందిన ఆళ్ల మిథున అలియాస్ జ్యోతితో భద్రిరాజుపాలెంకి చెందిన శ్రీకాంత్రెడ్డి నాలుగేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. విషయం తెలుసుకున్న శ్రీనివాసరెడ్డి కూడా ఫోన్ ద్వారా ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. ఏడాది క్రితం శ్రీకాంత్ రెడ్డి ఫోన్ ను అప్ డేట్ చేసే క్రమంలో జ్యోతి, శ్రీకాంత్ రెడ్డికి సంబంధించిన ఫొటోలను చూశాడు శ్రీనివాస్ రెడ్డి. వాటిని వెంటనే తన ఫోన్లో లోడ్ చేసుకున్నాడు.

ఒకే మహిళతో ఇద్దరి వివాహేతర సంబంధం, ఒకేసారి ఇంటికి రావడంతో ఘర్షణ.. ఒకరి దారుణ హత్య..(వీడియో)

బెదిరించి..వివాహేతర సంబంధం...
ఆ తరువాత తనతో సహకరించకపోతే మీ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని జ్యోతిని బెదిరించాడు. అలా జ్యోతితో శారీరక సంబంధం కొనసాగించాడు. ఆమెను శ్రీకాంత్ రెడ్డితో కలవకుండా దూరం పెట్టించడం మొదలు పెట్టాడు. దీంతో శ్రీకాంత్ రెడ్డి ఫోన్ నెంబర్ బ్లాక్లిస్టులో పెట్టింది జ్యోతి. ఆ తర్వాత అతడిని స్వయంగా కలిసి, విషయం చెప్పింది. శ్రీకాంత్ రెడ్డి ఈ విషయాన్ని శ్రీనివాస్ రెడ్డి కుటుంబ సభ్యులకు కలిసి చెప్పినా.. అతనిలో మార్పు రాలేదు. దీంతో అతడిని మట్టుపెట్టాలని పథకం పన్నాడు. 

స్నేహితుడి భార్యతోనూ...
ఈ నేపథ్యంలో శ్రీకాంత్ రెడ్డి, జ్యోతి సన్నిహితంగా ఉన్న ఫోటోలను శ్రీనివాస్ రెడ్డి.. శ్రీకాంత్ రెడ్డి భార్యకు చూపించి.. ఆమెతో కూడా పరిచయం పెంచుకుని.. వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయాలను శ్రీకాంత్ రెడ్డి కి తెలియకుండా రహస్యంగా ఉంచారు. ఇదే సమయంలో శ్రీనివాస్ రెడ్డిని ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని జ్యోతి, శ్రీకాంత్ రెడ్డి నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో గత నెల 25న రాత్రి జ్యోతి.. శ్రీనివాస్ రెడ్డికి ఫోన్ చేసి పిలిపించింది. 

ఆమె వద్దే ఉంటూ శ్రీనివాస్ రెడ్డి తన ఫోన్ నుంచి శ్రీకాంత్ రెడ్డి భార్య ఫోన్ కు మెసేజ్ లు పంపించాడు. అదే సమయంలో భార్య పక్కనే ఉన్న శ్రీకాంత్ రెడ్డి ఆ మెసేజ్లు అన్ని చూసి కోపంతో రగిలిపోయాడు. అర్థరాత్రి జ్యోతి ఇంటికి వెళ్ళాడు. ముందుగా చుట్టుపక్కల ఉన్న గేట్లకు, తరువాత పక్క గదుల్లో ఉంటున్న వారి తలుపులకు బయటినుంచి గడియలు పెట్టాడు. వారిద్దరూ ఉన్న గది తలుపు కొట్టగా జ్యోతి బయటకు వచ్చేసింది.

చంపింది ఇలా..
తలుపు తలుపు తీయగానే స్నేహితులిద్దరూ కొంతసేపు వాదులాడుకున్నారు. నిన్ను హతమార్చేందుకు రెండుసార్లు ప్రయత్నించానని శ్రీనివాస్ రెడ్డి.. శ్రీకాంత్ రెడ్డి శ్రీకాంత్ రెడ్డి తో అన్నాడు. పొలంలో బోరు రిపేరుకు వచ్చిందని పిలిచి స్విచ్ వేస్తే తప్పించుకున్నావని, రెండోసారి ఉయ్యూరు నుంచి వచ్చే క్రమంలో ఎదురుగా లారీ వస్తుంటే వెనక నుంచి కాలుతో మోపెడ్ ను తన్నగా పక్కకు పడిపోయి తప్పించుకున్న సంఘటనలన్నీ గుర్తు చేశాడు. అంతేకాదు.. నీ భార్యతో కూడా సంబంధం ఉందని ఫోన్ చూపించాడు. దీంతో శ్రీకాంత్ రెడ్డికి కోపం కట్టలు తెంచుకుంది. శ్రీనివాస్ రెడ్డి తలపై, భుజంపై శ్రీకాంత్ రెడ్డి పలుగు, కొడవలితో దాడి చేయడంతో కుప్పకూలిపోయాడు. గత నెల 26 తెల్లవారుజామున జరిగిన ఈ సంఘటన అనంతరం రక్తపు మరకలతోనే శ్రీకాంత్ రెడ్డి, జ్యోతి, తన 8 ఏళ్ల పాపను తీసుకుని పరారు అయ్యారు. 

ఆచూకీ ఇలా.. 
గత నెల 26న తెల్లవారుజాము నాలుగు గంటల 15 నిమిషాలకు విజయవాడలోని ఒక ఏటీఎంలో వెయ్యి రూపాయలు డ్రా చేశారు. రైల్వేస్టేషన్లో బండిని పార్కు చేసి వెళ్లిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఒకస్నేహితుడు శ్రీకాంత్రెడ్డి ఖాతాలో పదివేల రూపాయలు వేయగా గూడూరులోని ఏటీఎం నుంచి డ్రా చేశారు. నాలుగు బృందాలతో గాలిస్తున్న పోలీసులు సమాచారం తెలుసుకుని జల్లెడ పట్టారు. tirupati, తిరుమల తదితర పుణ్యక్షేత్రాలను సందర్శించి అక్కడి నుంచి తిరిగి విజయవాడ రాగా, శ్రీకాంత్ రెడ్డి, జ్యోతిని సోమవారం ఉదయం పట్టుకుని తోట్లవల్లూరు ఠాణాకు తీసుకువచ్చారు. విలేకరుల సమావేశం నిర్వహించి కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి రిమాండ్ విధించగా వారిని రాజమండ్రి కేంద్ర కారాగారానికి తరలించామని ఎస్సై వై. అర్జున్ తెలిపారు.