స్కిల్ డెవలప్మెంట్ అవకతవకలు అతిపెద్ద స్కామ్.. చంద్రబాబుకు తెలియకుండానే జరుగుతుందా?: సజ్జల
పోలవరం ప్రాజెక్టు ఆలస్యానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడే కారణమని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో జరిగింది అతిపెద్ద స్కామ్ అని ఆరోపించారు.
పోలవరం ప్రాజెక్టు ఆలస్యానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడే కారణమని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో జరిగిన అవకతవకలు అతిపెద్ద స్కామ్ అని ఆరోపించారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో రాజకీయ ప్రేమయం ఉందని విమర్శించారు. ఈ అంశంపై కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారణ జరుపుతున్నాయని.. త్వరలోనే అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని అన్నారు. అప్పుడు సీఎంగా ఉన్న చంద్రబాబుకు తెలియకుండానే ఇంతా పెద్ద స్కామ్ జరుగుతుందా? అని ప్రశ్నించారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో చంద్రబాబు, లోకేష్ పాత్ర లేకుండా అవకతవకలు జరగవని అన్నారు. ఈ వ్యవహారంలో ఎవరెవరి పాత్ర ఉంటే అందరిపై చర్యలు ఉంటాయని చెప్పారు.
చంద్రబాబు పోలవరంను ఏటీఎంగా మార్చుకున్నారని.. ప్రాజెక్టు పూర్తి చేసే అవకాశం వచ్చిన పూర్తి చేయలేకపోయారని విమర్శించారు. కాపర్ డ్యామ్, స్పిల్ వేల నిర్మాణంలో చంద్రబాబు ప్రభుత్వం చేసిన తిక్కపని వల్ల డ్యామేజ్ అంచనా వేయడానికే సమయం పడుతుందని చెప్పారు. చంద్రబాబు తిరిగి అధికారంలోకి వచ్చేది లేదు.. పోలవరం పూర్తిచేసేది లేదని ఎద్దేవా చేశారు. సీఎం జగన్ హయాంలోనే పోలవరం పూర్తి అవుతుందని అన్నారు.
రాష్ట్రంలో జౌట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగించే ప్రసక్తే లేదన్నారు. జౌట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగిస్తున్నామనే ప్రచారం అవాస్తవం అని చెప్పారు. సిబ్బందిని తొలగిస్తూ అధికారులు ఆదేశాలు ఇవ్వడంపై సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారని తెలిపారు. ఇచ్చిన ఆదేశాలను ఉపసంహరించుకోవాలని సీఎం జగన్ ఆదేశించారని చెప్పారు. న్యాయ పరిశీలన చేసి పకడ్బందీగా మూడు రాజధానుల బిల్లను శాసనసభలో ప్రవేశపెడతామని చెప్పారు.