కరోనా వైరస్: మరణించిన డాక్టర్ ఇంట్లో ఆరుగురికి కోవిడ్ -19 పాజిటివ్
కర్నూలులో కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఈ ఒక్క రోజే 13 కేసులు కొత్తగా నమోదయ్యాయి దీంతో కర్నూలు జిల్లాలో కోవిడ్ -19 కేసుల సంఖ్య 126కు చేరుకుంది. ఎమ్మిగనూరులో ఓ వ్యక్తి కరోనాచోత మరణించినట్లు తేలింది.
కర్నూలు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా 13 కోవిడ్ -19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో కర్నూలు జిల్లాలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 126కు చేరుకుంది.
కరోనా వైరస్ వల్ల ఇటీవల మరణించిన వైద్యుడి ఇంట్లో ఆరుగురికి కరోనా వైరస్ పాజిటివ్ ఉన్నట్లు తేలింది. కాగా ఎమ్మిగనూరులో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. ఎమ్మిగనూరులో మరణించిన వ్యక్తికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలింది. శ్వాససంబంధమైన సమస్యతో అతను ఇటీవల కర్నూలు ఆస్పత్రిలో చేరాడు. కరోనా పాజిటివ్ వచ్చినవారిలో ఓ వైద్యురాలు కూడా ఉన్నారు. ట్రావెల్ హిస్టరీ లేకుండానే నలుగురికి కరోనా వైరస్ పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారణ అయింది.
ఇదిలావుంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలో ఢిల్లీ మర్కజ్ లింకులు కలకలం సృష్టిస్తున్నాయి. తాజాగా నెల్లూరు జిల్లాలో ఐదు కేసులు నమోదయ్యాయి. దీంతో నెల్లూరు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 64కు చేరుకుంది.
ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో జరిగిన మత ప్రార్థనలకు వెళ్లి వచ్చినవారి నుంచే కోరనా వైరస్ వ్యాపిస్తున్నట్లు గుర్తించారు. తాజాగా నమోదైన కేసులు అందుకు సంబంధించి సెకండ్ కాంటాక్టులని చెబుతున్నారు. నెల్లూరు నగరంలోనే 25 కేసులు నమోదయ్యాయి.
ఇదిలావుంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాజాగా 38 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 572కు చేరుకుంది. కరోనా వైరస్ వ్యాధి సోకి ఏపీలో 14 మంది మరణించారు.
ఇండియాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా భారతదేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 13,500కు చేరుకుంది. మరణాలు 449కి చేరుకున్నాయి. మధ్యప్రదేశ్ లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. గురువారంనాడు ఒక్క రోజే 361 కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజులో అత్యధిక కేసులు నమోదైన సంఘటనల్లో ఇది రెండోది