పీలేరులో టీడీపీకి షాక్.. సీనియర్ లీడర్ రాజీనామా
దాదాపు పాతిక సంవత్సరాలుగా పార్టీ కోసం కృషి చేసినా...తమకు కనీసం గుర్తింపు కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి చిత్తూరు జిల్లాలో షాక్ తగిలింది. టీడీపీ పీలేరు నియోజకవర్గానికి సీనియర్ నేత, మాజీ ఇన్ చార్జీ మైనార్టీ నేత ఇక్బాల్ మహ్మద్ రాజీనామా చేశారు. ఆయనతో పాటు ఆయన మద్దతు దారులు మరో 20మంది కూడా పార్టీకి రాజీనామా చేశారు.
దాదాపు పాతిక సంవత్సరాలుగా పార్టీ కోసం కృషి చేసినా...తమకు కనీసం గుర్తింపు కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 2014లో కిరణ్కుమార్ రెడ్డి కుటుంబం మీద పోటీచేయాలని తన మీద చంద్రబాబు ఒత్తిడి తీసుకవచ్చారని.. అందుకే పోటీచేశానన్నారు. అయితే ఎన్నికల తరువాత అన్నివిధాల ఆదుకొంటామని సీఎం రమేష్ కూడా హామీ ఇచ్చారని తెలిపారు. అంతేకాకుండా టీడీపీ అధికారంలోకి వచ్చాక క్యాబినేట్ పదవిని ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు.. కానీ ఇప్పటివరకు న్యాయం జరగలేదని అన్నారు.
నల్లారి కిషోర్కుమార్ రెడ్డిని టీడీపీలో చేర్చుకునేటప్పుడు తనకు నామినేటెడ్ పదవిని ఇస్తానని చెప్పిన చంద్రబాబు తరువాత పట్టించుకోలేదన్నారు. పైగా కిషోర్ కుమార్ రెడ్డికి ఇన్చార్జీ బాధ్యతలను ఇవ్వడమే కాకుండా.. కార్పోరేషన్ పదవిని కూడా ఇచ్చారన్నారు. సీఎంను కలిసి అనేక సార్లు తాను పడుతున్న ఇబ్బందుల గురించి చెప్పానన్నారు. అయినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా.. ఇక్బాల్.. త్వరలో వైసీపీలో చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది.