షెకావత్వి అవగాహన రాహిత్య మాటలు- ఏపీ మంత్రి అనిల్ కుమార్
అన్నమయ్య ప్రాజెక్టు పై కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి అనిల్ కుమార్ స్పందించారు. టీడీపీ నాయకుల మాటలు విని కేంద్ర మంత్రి అవగాహన రాహిత్యంగా మాట్లాడారని తెలిపారు.
కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ అవగాహన రాహిత్యంగా మాట్లాడారని ఏపీ మంత్రి అనిల్ కుమార్ అన్నారు. బహుషా ఆయన టీడీపీ నాయకుల మాటలు విని అలా మాట్లాడుతున్నారేమో అని తెలిపారు. ఈ మేరకు మంత్రి అనిల్ కుమార్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఏపీలో వరదలను అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేయడం తగదని అన్నారు. అన్నమయ్య ప్రాజెక్టు గేట్లు తెగిపోవడం ఒక ప్రమాదమని అన్నారు. అకస్మాత్తుగా వచ్చిన వరదల వల్ల ఈ ఘటన జరిగిందని చెప్పారు. ఐదో గేటు తెరుచుకొని ఉంటే ప్రమాదం జరిగేది కాదని అనడం మంత్రి అవగాహన రాహిత్యంగా మాట్లాడాారని అర్థమవుతోందని తెలిపారు.
ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయాలా ?
రాష్ట్రంలో ఇప్పుడు నెలకొని ఉన్న పరిస్థితులో ఇలా వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని అన్నారు. ఈ సమయంలో రాజకీయాలు చేయకూడదని తెలిపారు. ఏడాది మొదట్లో ఉత్తరాఖండ్లో ఇటువంటి ఘటనే జరిగిందని గుర్తు చేశారు. ఆ ప్రమాదంలో సుమారు 150 మంది వరకు చనిపోయారని అన్నారు. అక్కడ బీజేపీ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి నిజం బయటకు తెలియనీయలేదని ఆరోపించారు. ఒకే సారి వచ్చిన వరద ఉదృతి వల్ల అన్నమయ్య ప్రాజెక్టు కు ప్రమాదం జరిగిందని తెలిపారు. ఆ సమయంలో వచ్చిన నీటి సామర్థ్యం 3 లక్షల క్యూసెక్కుల వరకు ఉందని అన్నారు. ఒక వేళ గేటు తెరుచుకున్నా కేవలం 40 వేల క్యూసెక్కుల నీరే బయటకు వెళ్లేదని మంత్రి చెప్పారు. గేటు తెరుచుకోకపోవడం ఘటనకు కారణం కాదని అన్నారు.
https://telugu.asianetnews.com/andhra-pradesh/cm-jagan-should-step-down-demands-tdp-chief-chandrababu-r3l5mb
టీడీపీ నాయకుల పిట్ట కథ వినే వ్యాఖ్యలు..
టీడీపీ నాయకులైన సీఎం రమేష్, సుజనా చౌదరి మాటలు వినే బహుషా కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటారని మంత్రి అనిల్ కుమార్ అభిప్రాయపడ్డారు. వారిద్దరే ఆయనకు ఏపీ గురించి పిట్ట కథ చెప్పి ఉంటారని, వారి మాటలు విని కేంద్ర మంత్రి మాట్లాడారని తెలిపారు. కేంద్ర మంత్రి స్థానంలో ఉండి ఏం జరిగిందని విచారించకుండా ఇలా మాట్లాడటం సరైంది కాదని అన్నారు. అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఇక్కడ ఉన్న అధికారులనెవర్నీ కేంద్ర మంత్రి వివరణ అడగలేదని చెప్పారు. ఇంత సున్నితమైన అంశాలపై కూడా నిరాధారమైన ఆరోపణలు చేయడం తగదని అన్నారు. రాష్ట్రంలో ఉన్న జలప్రళయం సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని తెలిపారు. టీడీపీ నాయకుల మాటలు విని కేంద్ర మంత్రి ఇలా మాట్లాడటం హాస్యాస్పదమని అన్నారు. తమ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసమే పని చేస్తుందని తెలిపారు.