టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల  రామకృష్ణారెడ్డి మరోసారి విమర్శల వర్షం గుప్పించారు. రాష్ట్రంలో హింసను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు.

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మరోసారి విమర్శల వర్షం గుప్పించారు. రాష్ట్రంలో హింసను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. పథకం ప్రకారమే ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని విమర్శించారు. ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా చూపిస్తున్నారని ఆరోపించారు. పూనకాలు, అరుపులు, తిట్లు తప్ప పవన్ కల్యాణ్ స్పీచ్‌లో ఏముందని ప్రశ్నించారు. ఏదో పిచ్చి కేకలు వేస్తే అభిమానులు ఈలలు వేయడం కామనేనని అన్నారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

చంద్రబాబు నాయుడు ప్రధాని మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రాసిన లేఖలో.. రామోజీ రావు, రాధాకృష్ణ పేపరల్లో కొంతకాలంగా వచ్చిన వార్తలనే ప్రస్తావించారని అన్నారు. హత్యాయత్నం జరిగిందని.. సీబీఐ విచారణ జరిపించాలని చంద్రబాబబు కోరారని.. ఇదే వ్యక్తి అధికారంలో ఉన్నప్పుడే సీబీఐని రాష్ట్రంలో అడుగుపెట్టనివ్వని అన్నారని విమర్శించారు. 

పుంగనూర్, అంగళ్లలో పోలీసులను కొట్టారని, వాహనాలను ధ్వంసం చేశారని అన్నారు. పుంగనూరు‌, అంగళ్లలో ఘోరం జరగాలనే చూశారని.. పోలీసులు సంయమనం పాటించకపోతే వారు కోరుకున్నదే జరిగేదని అన్నారు. అధికారం అనేది ఆయన సొంతం అని చంద్రబాబు భావిస్తున్నారని.. అది లేకపోవడంతో ఉన్మాదిగా మారుతున్నారని ఆరోపించారు. 

వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబు దిట్ట అని విమర్శించారు. చంద్రబాబు ఓ విప్లవ పోరాటం చేసినంతా బిల్డప్ ఇస్తున్నారని మండిపడ్డారు. పవన్ కల్యాణ్‌ లేవనెత్తిన అంశాలు సందర్భరహితం, అప్రస్తుతం అని మండిపడ్డారు. అందుకే ఆయన మాట్లాడిన అంశాలపై తాను స్పందించడం లేదని చెప్పారు. అధికారంలోకి రావాలనే ఆలోచనల పవన్ కల్యాణ్‌కు లేదని.. చంద్రబాబుకు అధికారం రావడం కోసమే ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. పవన్ కల్యాణ్ ఆయన పాపులారిటీని దుర్వినియోగం చేస్తున్నారని అన్నారు. 

రుషికొండలో పవన్ విన్యాసాలు చేశారని.. ఆయనకు అవసరమైన అరెంజె‌మెంట్స్ చంద్రబాబు చేస్తున్నారని అన్నారు. పవన్ అహంకారంతో వ్యవహరిస్తున్నారని.. ప్రజలు ప్రజాస్వామ్యయుతంగా సరైన సమయంలో సరైన నిర్ణయం ఇస్తున్నారని తెలిపారు. 2019 ఎన్నికల్లో గాజువాక ప్రజలు పవన్ కల్యాణ్‌ను తిరస్కరించారని చెప్పారు. 

జగన్ నాలుగేళ్ల పాలనలో పారదర్శకంగా ఏం చేశారనేది ప్రజలకు అనుభవంలోకి వచ్చిందని.. అందుకే చంద్రబాబుకు మాట్లాడటానికి ఏం లేకుండా పోయిందని విమర్శించారు. పవన్ అడ్డగోలు ప్రశ్నలు వేస్తే.. ఎవరూ సమాధానం చెప్పలేరని అన్నారు. చంద్రబాబు అమలు చేసిన ఒక్క మంచి ఫథకమైనా ఉందా? అని ప్రశ్నించారు.