కలిసొచ్చినా, విడివిడిగా వచ్చినా ఓకే.. కానీ సీఎం అభ్యర్థి ఎవరో క్లారిటీ తెచ్చుకోండి.. పవన్ కు సజ్జల చురకలు
జనసేన ఎవరితోనైనా కలిసొచ్చినా, విడిగా వచ్చినా తమకు ఓకే అని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. పొత్తులు పెట్టుకునే ముందు ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో ఒక క్లారిటీకి రావాలన్నారు.
అమరావతి : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన మీద విష ప్రచారం చేస్తున్నారని చేస్తున్నారని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. తాడేపల్లి లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. సబ్ ప్లాన్ నిధులు దుర్వినియోగం అంటున్న పవన్ ఏ ఆధారాలతో అంటున్నాడని ప్రశ్నించారు. గెస్ట్ ఆర్టిస్ట్ లా వచ్చి చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ చదివి వెళ్తాడన్నారు. సబ్ ప్లాన్ కంటే ఎక్కువగా నిధులు అందిస్తున్నాం. చంద్రబాబు ఐదేళ్లలో రూ. 33 వేలు ఖర్చు చేశారు. జగన్ మూడేళ్లలో రూ. 48 వేల కోట్లు నిధులు ఇచ్చారు. కేవలం డిబిటి ద్వారానే 30 వేల కోట్లు ఎస్సీ,ఎస్టీ లకు ఇచ్చాం. పొలిటికల్ గా, పదవులు పరంగా ఎస్సీ,ఎస్టీలకు జగన్ అధిక ప్రాధాన్యత ఇచ్చారన్నారు.
సకల శాఖల మంత్రి అని పవన్ నాపై విష ప్రచారం చేస్తున్నారు. నన్ను టార్గెట్ గా చేసుకుని ప్రజల్లో ఏదో క్రియేట్ చెయ్యడానికి ఇలా చేస్తున్నారు. పొత్తుల గురించి పవన్ చెప్పిన మూడు ఆప్షన్స్ నవ్వొస్తుంది. ఏమీ లేకుండా చంద్రబాబుకి సపోర్టు చెయ్యడం అనే నాలుగో ఆప్షన్ కూడా చెప్పాల్సింది. గత రెండు ఎన్నికల మాదిరిగానే ఈసారి కూడా పవన్ రిమోట్ చంద్రబాబు చేతుల్లోనే ఉంటుందని ఎద్దేవా చేశారు.
లోకేష్ పాదయాత్రను టిడిపి ఎక్కువగా ఊహించుకుంటుంది.జగన్ పాదయాత్ర చేసినప్పుడు ఉన్న నిబంధనలే ఇప్పుడు ఉన్నాయి. జగన్ ఆంక్షలకు లోబడే పాదయాత్ర చేశారు.. ఆంక్షలు పెట్టారని గగ్గోలు పెట్టలేదు. కందుకూరు ఘటనతో రోడ్లపై సభలు నిషేధం నిర్ణయం తీసుకున్నాం. లోకేష్, పవన్, చంద్రబాబులలో సీఎం అభ్యర్థి ఎవరో ప్రజలకు చెప్పండి. వైసీపీ అంటే జగన్.. జగన్ అంటే వైసీపీ మేము స్పష్టంగా ఉన్నాం. మీరెందుకు స్పష్టంగా చెప్పలేక పోతున్నారు..? విడివిడిగా వచ్చినా.. కలిసి వచ్చినా మాకు ఒకే అని అన్నారు.
సబ్ ప్లాన్ దుర్వినియోగం అంటూ తనమీద ఆరోపణలు చేస్తున్నాడని దీనిమీద పవన్ కల్యాణ్ దగ్గర ఆధారాలు ఉన్నాయా అని ప్రశ్నించారు. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు రిమోట్ నొక్కితే.. ఇక్కడ పవన్ కళ్యాణ్ నోటి నుంచి మాటలు వస్తాయని ఆయన దుయ్యబట్టారు. చంద్రబాబు హయాంలోప్రచారం ఎక్కువగా చేసుకున్నారని…ఆయన హయాంలో చేసింది అంతా డొల్లే అని సజ్జల మండిపడ్డారు.
కన్నాకు బీజేపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ శివప్రకాష్ ఫోన్: రేపు విజయవాడలో భేటీ
ఇదిలా ఉండగా, అంతకుముందు పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ కు చెందిన నేతలు వేర్పాటువాద ధోరణితో మాట్లాడుతున్నారని.. అలా మాట్లాడితే తనలాంటి తీవ్రవాదిని ఇంకోసారి చూడరని అన్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రత్యేక రాష్ట్రాలు కావాలని కొందరు నేతలు ఇటీవల కాలంలో చేస్తున్న వ్యాఖ్యల మీద పవన్ కళ్యాణ్ ఈ విధంగా వ్యాఖ్యానించారు. ‘మీ బతుకులకు ఏం తెలుసు.. ? కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ డిబేట్స్ చదివారా? అని పరుష పదజాలంతో ప్రశ్నించారు.
పబ్లిక్ పాలసీ తెలియని.. అవినీతిలో మునిగిపోయిన మీరు రాష్ట్రాన్ని విడగొట్టేస్తారా? అది చూస్తూ మేము కూర్చుంటామా? అని మండిపడ్డారు. రాష్ట్రం విడిపోవడం వల్ల ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ చాలా నష్టపోయిందని మరోసారి రాష్ట్రాన్ని విడగొడతారా అని ప్రశ్నించారు. మరోసారి విడగొడతామంటే తోలు తీసి కింద కూర్చోబెడతామని ధ్వజమెత్తారు.