కాకినాడ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. అర్ధరాత్రి నిద్రిస్తున్న ఓ రౌడీషీటర్ పై గుర్తుతెలియని దుండగులు దాడిచేసి చంపారు.
కాకినాడ: కత్తి పట్టినవాడు అదే కత్తివేటుకు బలవుతాడని అంటుంటారు. ఇలా చిన్నవయసులోనే నేరాల బాటపట్టిన రౌడీ షీటర్ గా మారిన యువకుడు కత్తివేటుకు బలయ్యాడు. ఈ దారుణం కాకినాడ జిల్లాలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే... కాకినాడ పట్టణానికి చెందిన రౌడీషీటర్ జగదీష్ (28) ఈజీ మనీకోసం నేరాలు చేస్తుంటాడు. గతంలో అతడిపై అనేక కేసులు వుండటంతో పోలీసులు రౌడీ షీట్ ఓపెన్ చేసారు. అయినప్పటికి అతడి ప్రవర్తనలో మాత్రం మార్పు లేకపోగా మరింతగా నేరాలు చేయసాగాడు. ఇలా ఈజీగా డబ్బులు సంపాదించడానికి గంజాయి దందా చేపట్టారు.
అయితే గంజాయి వ్యాపారంలో లావాదేవీల విషయంలో జగదీష్ కు విబేదాలు ఏర్పడ్డాయి. అలాగే గతంలో చేసిన నేరాలతో అతడికి శతృవులు పెరిగిపోయారు. గంజాయి వ్యాపారం విబేధాలో, పాత కక్ష్యలు కారణమో తెలీదుగానీ జగదీష్ కు గుర్తుతెలియని దుండగులు దాడిచేసి అతికిరాతకంగా చంపారు.
శనివారం అర్ధరాత్రి కాకినాడలోని అంబేద్కర్ భవన్ లో నిద్రపోతున్న జగదీష్ పై దుండగులు దాడిచేసారు. నిద్రలోవున్న జగదీష్ పై కత్తులతో దాడిచేయడంతో తీవ్ర గాయాలపాలై అక్కడిక్కడే మృతిచెందాడు. అతడు చనిపోయాడని నిర్దారించుకున్నాకే అక్కడినుండి వెళ్ళిపోయారు.
ఉదయం రక్తపుమడుగులో పడివున్న జగదీష్ మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఇక ఆస్తికోసం కన్నతండ్రినే అతి దారుణంగా చంపి ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసి దొరికిపోయాడు కసాయి కొడుకు. స్కూటీ మీద వెళ్తున్న తండ్రిని వెనుక నుంచి కారుతో ఢీకొట్టడంతో బాధితుడు తీవ్ర గాయాలపాలై కోమాలోకి వెళ్లిపోయాడు. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా కేసు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు కొడుకే తండ్రిని చంపేందుకు ప్రయత్నించాడని నిర్ధారించి అరెస్ట్ చేశారు. నిందితుడు లక్ష్మీప్రసాద్ రెడ్డి రిటైర్డ్ ఆర్మీ జవాన్గా పోలీసులు తెలిపారు.
అన్నమయ్య జిల్లా పీలేరుకు చెందిన చంద్రశేఖర్ రెడ్డికి ఇద్దరు భార్యలు. పెద్ద భార్యకు ఇద్దరు కొడుకులు, చిన్న భార్యకు పిల్లలు లేరు. అయితే ఇద్దరు కొడుకుల్లో పెద్దవాడు చనిపోవడంతో ఆస్తి కావాలంటూ చిన్న కొడుకు లక్ష్మీ ప్రసాద్ రెడ్డి పట్టుబట్టాడు. దీంతో సగం ఆస్తిని కొడుక్కి రాసిచ్చాడు. ఆ తర్వాత రెండో భార్య తమ్ముడి దగ్గరే వుంటున్నాడు.
దీంతో మిగిలిన సగం ఆస్తిని అతనికి రాసిస్తాడేమోనన్న అనుమానంతో తండ్రిని చంపేందుకు ప్రయత్నించాడు. దీనిలో భాగంగా స్కూటీ మీద వెళ్తున్న తండ్రిని కారుతో ఢీకొట్టి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు. ప్రమాదంపై అనుమానం రావడంతో చంద్రశేఖర్ రెడ్డి బావమరిది ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. దర్యాప్తులో కొడుకు లక్ష్మీ ప్రసాద్ రెడ్డే తండ్రిని చంపేందుకు ప్రయత్నించాడని తేల్చారు.
