ఏలూరులో ఓ పోలీస్ స్టేషన్ లో రౌడీషీటర్ బర్త్ డే వేడుకలు నిర్వహించారు. దీంతో ఇద్దరు పోలీసులను సస్పెండ్ చేశారు. ఒకరికి ఛార్జ్ మెమో జారీ చేశారు. 

ఏలూరు : పోలీస్ స్టేషన్లో ప్రాంగణంలో ఓ Rowdy sheeter పుట్టినరోజు వేడుకలు నిర్వహించడం ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో సంబంధిత పోలీసుపై వేటు పడింది. ఆ రౌడీ షీటర్ అధికార పార్టీకి చెందిన ఓ మహిళా కార్పొరేటర్ భర్త కావడం గమనార్హం.  ఏలూరు టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో ప్రతి నెలా రౌడీ షీటర్ లను పిలిపించి కౌన్సిలింగ్ ఇస్తుంటారు. ఇదే క్రమంలో ఈ నెల 18వ తేదీ సాయంత్రం కూడా రౌడీషీటర్లు స్టేషన్ కు వచ్చారు. వారిలో వైసిపి కార్పొరేటర్ భర్త  భీమవరపు హేమసుందర్ ఉన్నారు.  

పోలీసులు ఎవరి హడావుడిలో వారు ఉండగా కొందరు రౌడీలు స్టేషన్ ప్రాంగణంలోనే హేమ సుందర్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఈ వ్యవహారంపై డీఐజీ పాలరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఎస్సై కిషోర్ బాబు,  కానిస్టేబుల్ రాజేష్ లను సస్పెండ్ చేయడంతో పాటు సీఐ రమణకు ఛార్జ్ మెమో జారీ చేశారు. ఘటనపై విచారణ చేపట్టారు. 

ఇదిలా ఉండగా, హైదరాబాద్ లో ఫిబ్రవరి 11న ఓ రౌడీషీటర్ హల్ చల్ చేశాడు. సైకోలా మారిన రౌడీషీటర్ అర్ధరాత్రివేళ బంజారాహిల్స్, గోల్కొండ పోలీసులను పరుగులు పెట్టించాడు. పట్టుకునేందుకు వెళ్లగా కత్తితో బెదిరించాడు. టోలీచౌకీలోని ఓ ఆసుపత్రిలోకి వెళ్లి రోగి మెడపై కత్తి పెట్టి పొడుస్తానని బెదిరించాడు. పోలీసులు చాకచక్యంగా అతన్ని అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు.

నాంపల్లి బజార్ ఘాట్ కు చెందిన రౌడీ షీటర్ ఫరీద్ ఖాద్రీ(27) మతిస్థిమితం కోల్పోయి సైకోలా మారాడు. ఘటన రోజు రాత్రి బంజారాహిల్స్ లోని సయ్యద్ నగర్ లో వరుసకు సోదరుడయ్యే మాజిద్ ను కలిశాడు. ఆ తర్వాత తన కారులో వెళ్తూ పోలీసు పెట్రోలింగ్ వాహనాన్ని ఢీ కొట్టాడు. పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో స్థానికులు గుమిగూడారు. దీంతో కారు వదిలేసి.. కత్తి తీసి అటుగా వెళుతున్న వ్యక్తిని బెదిరించి ద్విచక్రవాహనం లాక్కుని పారిపోయాడు. పోలీసులు అన్ని పోలీస్ స్టేషన్ల సిబ్బందిని అప్రమత్తం చేశారు. నానల్ నగర్ వైపు నుంచి టోలిచౌకి వచ్చాడు. టోలిచౌకి నుంచి వెళ్లే దారిలో ఆటోలను అడ్డంగా ఉంచడంతో ఆటోను ఢీకొని కిందపడిపోయాడు. దగ్గరలోని ఓ హోటల్ లోకి వెళ్ళాడు. అప్రమత్తమైన  సీఐ చంద్రశేఖర్ రెడ్డి ఓ ద్వి చక్ర వాహనదారుడి సహకారంతో ఫరీద్ ను వెంబడించారు. ఈలోగా సమీపంలోని యాపిల్ ఆస్పత్రిలోకి చొరబడిన రౌడీషీటర్ ఓ రోగి మెడపై కత్తి పెట్టి బెదిరించాడు. అతడితో మాట్లాడుతూ..  దగ్గరకు వెళ్లిన పోలీసులు ఎట్టకేలకు అదుపులోకి తీసుకుని పీఎస్ కు తరలించారు.

విచారణలో ఫరీద్ తీసుకువచ్చిన కారు మల్కాజ్ గిరి పరిధిలో దొంగిలించింది అని  గుర్తించారు. అతడిపై గోల్కొండ పిఎస్ లో సెక్షన్ 392, 332, ఆయుధ చట్టాల కింద కేసు నమోదు చేశారు. సయ్యద్ నగర్ లో పోలీసు వాహనాన్ని ఢీ కొట్టినందుకు బంజారాహిల్స్ పోలీసులు,  కారు చోరీ చేసినందుకు మల్కాజిగిరి ఠాణాల్లోనూ కేసులు నమోదయ్యాయి. రెండు రోజుల క్రితం నాంపల్లి ఠాణా పరిధిలో ఓ బైకుకు నిందితుడు నిప్పంటించినట్లు గుర్తించారు. ఫరీద్ గతంలో ఏడాది పాటు ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయంలో ఉన్నాడు. అతని మీద 16 కేసులు ఉండడంతో రెండుసార్లు పీడీ చట్టం ప్రయోగించారు. అతని నుంచి 2 కత్తులు, బైకు స్వాధీనం చేసుకున్నారు.