ప్రకాశం బ్యారేజీపై జరిగిన ఓ రోడ్డు ప్రమాదం ఓ కుటుంబంలో విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో తండ్రి మృతిచెందగా కొడుకు తీవ్ర గాయాలపాలై ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు.
తాడేపల్లి: ఆదివారం రాత్రి ప్రకాశం బ్యారేజీ (prakasam barrage)పై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గుంటూరు జిల్లా (guntur) తాడేపల్లి (thadepalli) వద్ద ప్రకాశం బ్యారేజిపై తండ్రీకొడుకులు స్కూటీపై వెళుతుండగా రాంగ్ రూట్ లో వచ్చిన ఓ కారు వీరిని ఢీకొట్టింది. దీంతో తండ్రి కృష్ణా నది (krishna river)లో పడి చనిపోగా కొడుకు పరిస్థితి విషమంగా వుంది. కారులోని వ్యక్తి కూడా తీవ్రంగా గాయపడ్డాడు.
ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. విజయవాడ (vijayawada) లోని లబ్బీపేటకు చెందిన ఖాదర్ కొడుకు ఫిరోజ్ తో కలిసి మంగళగిరిలోని బంధువుల ఇంటికి వెళ్లాడు. ఇద్దరూ సాయంత్రం వరకు మంగళగిరిలోనే వుండి కాస్త చీకటిపడ్డాక స్కూటీపై విజయవాడకు బయలుదేరారు.
ఈ క్రమంలో వీరు ప్రకాశం బ్యారేజీపై ప్రయాణిస్తుండగా ఘోర ప్రమాదం జరిగింది. విజయవాడ వైపునుండి వీరికి ఎదురుగా రాంగ్ రూట్ లో దూసుకువచ్చిన ఓ కారు స్కూటీని ఢీకొట్టింది. దీంతో స్కూటీపై వున్న ఖాదర్ అమాంతం ఎగిరి కృష్ణానదిలో పడిపోయాడు. అతడి కొడుకు ఫిరోజ్ తీవ్ర గాయాలతో రోడ్డుపైనే పడిపోయాడు.
ప్రకాశం బ్యారేజీ 23వ గేట్ వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వెంటనే మిగతా వాహనదారులు పోలీసులకు సమాచారం ఇవ్వగా హుటాహుటిన వారు ఘటనాస్థలానికి చేరుకున్నారు. తీవ్ర గాయాలతో పడివున్న ఫిరోజ్ తో పాటు ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ ను కూడా మెరుగైన చికిత్స కోసం విజయవాడ ఆంధ్ర హాస్పిటల్ కు తరలించారు.
అలాగే నదిలో పడిపోయిన ఖాదర్ మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు పోలీసులు. అనంతరం ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కారు డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణంగా ప్రాథమికంగా తేలినట్లు తాడేపల్లి పోలీసులు తెలిపారు.
ఇలా రోడ్డు ప్రమాదంలో తండ్రి ప్రాణాలు కోల్పోవడం, కొడుకు హాస్పిటల్ పాలవడం ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది. ఘటనా స్థలంవద్దకు చేరుకున్న బాధిత కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
ఇదిలావుంటే ఆదివారం తెల్లవారుజామున కరీంనగర్ karimnagar) లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పొట్టకూటికోసం కరీంనగర్ కు వచ్చి రోడ్డుపక్కన గుడిసెలు వేసుకుని జీవిస్తున్న కొందరిని కారు రూపంలో వచ్చిన మృత్యువు కబళించింది. అతివేగంతో వచ్చిన కారు అదుపుతప్పి నిరుపేదల గుడిసెలపైకి దూసుకెళ్లడంతో నలుగురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.
కరీంనగర్ కమాన్ వద్ద కొందరు వీధివ్యాపారులు గుడిసెలు వేసుకుని వుంటున్నారు. వీరంతా తమ తమ గుడిసెల్లో గాడనిద్రలో వుండగా ఓ కారు రూపంలో మృత్యువు వీరిని వెంటాడింది. కొందరు యువకులు కరీంనగర్ నుండి హైదరాబాద్ వెళుతుండగా వీరి గుడిసెల వద్దకు రాగానే కారు అదుపుతప్పింది. దీంతో ఒక్కసారిగా కారు అతివేగంతో గుడిసెలపైకి దూసుకెళ్లింది. ఇలా గుడిసెల్లో నిద్రిస్తున్నవారిపైనుండి కారు దూసుకెళ్లడంతో నలుగురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. మృతి చెందిన వారిని ఫరియాద్, సునీత, లలిత, జ్యోతిలుగా గుర్తించారు.
ఈ రోడ్డు ప్రమాదంపై పోలీసుల చేపట్టిన దర్యాప్తులో కీలక విషయాలు బయటపడుతున్నాయి. ప్రమాద సమయంలో కారును నడిపింది ఓ మైనర్ గా పోలీసులు గుర్తించినట్లుగా సమాచారం.
