సత్తెనపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం... ముగ్గురు యూపీ కూలీలు మృతి
గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో బుధవారం జరిగిన ఘోర రోడ్డుప్రమాదంలో ఉత్తరప్రదేశ్ కు చెందిన కూలీలు మృత్యువాతపడ్డారు.
గుంటూరు: తెల్లవారుజామున పొట్ట చేతపట్టుకుని కూలీపని కోసం వెళుతున్న వారి బ్రతుకులు తెల్లారిపోయాయి. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో బుధవారం జరిగిన ఘోర రోడ్డుప్రమాదంలో ఉత్తరప్రదేశ్ కు చెందిన కూలీలు మృత్యువాతపడ్డారు.
ప్రమాదానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ కు చెందిన కొందరు పొట్టకూటికొసం ఆంధ్ర ప్రదేశ్ లో నివాసముంటున్నారు. గుంటూరులో నివాసముంటున్న వీరు ధూళ్లిపాళ్ళ కళ్ళేం స్పిన్నింగ్ మిల్లులో పనిచేస్తున్నారు.
read more నెల్లూరు జిల్లాలో ఆగి ఉన్న ఆటోను ఢీకొట్టిన పాల వ్యాన్: ఐదుగురు దుర్మరణం
అయితే రోజూ మాదిరిగానే ఇవాళ తెల్లవారుజామున కూలీలంతా కలిసి ఓ ఆటోలో పనికోసం స్పిన్నింగ్ మిల్లుకు బయలుదేరారు. ఈ క్రమంలో వీరు ప్రయాణిస్తున్న ఆటో సత్తెనపల్లి ఐదులాంతర్ల సెంటర్ వద్దకు రాగానే రోడ్డు ప్రమాదానికి గురయ్యింది. గుర్తుతెలియని వాహనం ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు కూలీలు అక్కడికక్కడే మృతిచెందగా మిగతావారు తీవ్రంగా గాయపడ్డారు. ఆటో నుజ్జునుజ్జయ్యింది.
ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ముందుగా క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత మృతదేహాలను కూడా పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. గాయపడినవారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా వున్నట్లు తెలుస్తోంది.