ఏపీ పాఠశాల విద్యా శాఖ పదవికి ఆకునూరి మురళీ రాజీనామా.. జగన్కు లేఖ
ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖలో మౌలిక సదుపాయాల సలహాదారు పదవికి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి రాజీనామా చేశారు. తన స్వరాష్ట్రం తెలంగాణలో విద్య, వైద్యం పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయని.. అక్కడి పరిస్థితి మెరుగుపర్చేందుకు ప్రయత్నిస్తానని మురళి తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖలో మౌలిక సదుపాయాల సలహాదారు పదవికి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి రాజీనామా చేశారు. ఇకపై తెలంగాణలో విద్యా వ్యవస్థ అభివృద్ధికి సేవలు అందిస్తానని ఆయన తెలియజేశారు. ఈ మేరకు ఏపీ సీఎం వైఎస్ జగన్కు శుక్రవారం లేఖ రాశారు. తెలంగాణలో విద్య, వైద్య పరిస్థితులు దారుణంగా ఉన్నాయని, అక్కడి పరిస్థితి మెరుగుపర్చేందుకు ప్రయత్నిస్తానని మురళి తెలిపారు. తన సేవలు తెలంగాణలో అవసరం ఉందంటూ సీఎం జగన్కు రాసిన లేఖలో పేర్కొన్నారు. గత మూడేళ్లుగా ఏపీ ప్రభుత్వంలో పాఠశాల విద్యాశాఖ సలహాదారుగా పనిచేయడం గొప్ప అనుభూతిని మిగిల్చిందన్నారు. సీఎం జగన్ పాఠశాల విద్యాశాఖ, ముఖ్యంగా నాడు-నేడుకు అధిక ప్రాధాన్యత ఇచ్చారని మురళి ప్రశంసించారు. ఇదే సమయంలో తన స్వరాష్ట్రం తెలంగాణలో విద్య, వైద్యం పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే తన సేవలు పూర్తిగా తెలంగాణలో అందించేందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది అని ముఖ్యమంత్రికి రాసిన లేఖలో మురళి వెల్లడించారు.