విషవాయువు లీక్: వెంకటాపురంలో ఇళ్లలో రెస్క్యూ సిబ్బంది తనిఖీలు
: విశాఖపట్టణం జిల్లా ఆర్ఆర్ వెంకటాపురం గ్రామంలో ఇళ్లలో రెస్క్యూ సిబ్బంది, పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎవరైనా ఇళ్లలో ఉన్నారా అనే కోణంలో ఆరా తీస్తున్నారు.
విశాఖపట్టణం: విశాఖపట్టణం జిల్లా ఆర్ఆర్ వెంకటాపురం గ్రామంలో ఇళ్లలో రెస్క్యూ సిబ్బంది, పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎవరైనా ఇళ్లలో ఉన్నారా అనే కోణంలో ఆరా తీస్తున్నారు.
గురువారం నాడు తెల్లవారుజామున ఎల్జీ పాలీమర్స్ ఫ్యాక్టరీ నుండి విషవాయువు వెలువడింది. ఈ విషవాయువు కారణంగా సుమారు ఎనిమిది మంది మృతి చెందారు.. వందలాది మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకొంది. ప్రజలంతా గాఢ నిద్రలో ఉన్న సమయంలో విషవాయువు లీకైంది. మహిళలు, వృద్ధులు, ఇళ్ల నుండి బయటకు భయంతో పరుగులు తీశారు.
వెంకటాపురం నుండి మేఘాద్రిగడ్డ వైపుకు స్థానికులు పరుగులు తీశారు. వెంకటాపురంంతో పాటు సమీపంలోని ఐదు గ్రామాల ప్రజలను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు.
ఇళ్లలో ఎవరైనా స్పృహా కోల్పోయి ఉన్నారా అనే కోణంలో కూడ అధికారులు ఆరా తీస్తున్నారు. వెంకటాపురం గ్రామంలో ప్రతి ఇంటిని తనిఖీ చేస్తున్నారు. ఇవాళ ఉదయం ఈ ప్రాంతానికి చేరుకొన్నప్పటికీ కూడ విషవాయువు తీవ్రత కారణంగా కొందరు పోలీసులు కూడ అస్వస్థతకు గురయ్యారు.
ఇళ్లలో అపస్మార స్థితిలో ఉన్నవారు ఎవరైనా ఉంటే వారిని ఆదుకోవడానికి ప్రభుత్వం అధికారులు ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఇళ్లలో ఉన్నవారిని ఆసుపత్రులకు తరలించేందుకు అంబులెన్స్ ను వాహనాలను సిద్దంగా ఉంచారు.