మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు గజ్జల ఉమాశంకర్రెడ్డి భార్య స్వాతిపై దాడి, బెదిరింపుల ఘటనలో పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు.
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు గజ్జల ఉమాశంకర్రెడ్డి భార్య స్వాతిపై దాడి, బెదిరింపుల ఘటనలో పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. సింహాద్రిపురం మండలం కసనూరుకు చెందిన కొమ్మా పరమేశ్వరరెడ్డి, ఆయన కొడుకు సునీల్కుమార్రెడ్డిలను అరెస్ట్ చేసిన పోలీసులు మంగళవారం రోజున జమ్మలమడుగులోకి కోర్టులో హాజరుపరిచారు. దీంతో కోర్టు పరమేశ్వరరెడ్డి, సునీల్కుమార్రెడ్డిలకు 14 రోజుల రిమాండ్ విధించింది. ఇక, వివేకా హత్యను జీర్ణించుకోలేకపోయామని, ఉమాశంకర్రెడ్డిపై ఏర్పడిన కోపంతోనే ఆయన భార్యపై దాడికి యత్నించినట్టు నిందితులు అంగీకరించారని పోలీసులు పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే.. కొమ్మా పరమేశ్వరరెడ్డి, ఆయన కొడుకు తమపై బెదిరింపులకు పాల్పడినట్టుగా గజ్జల స్వాతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్వాతి ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. తాము బెదిరింపులు ఎదుర్కొంటున్నట్టుగా తెలిపారు. తన భర్త ఉమాశంకర్ రెడ్డిని, తనను చంపేస్తామని కొమ్మా పరమేశ్వర్ రెడ్డి, ఆయన కొడుకు బెదిరింపులకు పాల్పడుతున్నారని తెలిపారు. ఈ విషయాలు చెప్పాలంటే కూడా తనకు భయంగా ఉందని చెప్పారు. తమ కుటుంబానికి ఏదైనా జరిగితే పరమేశ్వర్ రెడ్డిదే బాధ్యత అని అన్నారు.
‘‘శనివారం మధ్యాహ్నం 1.45 గంటలకు పరమేశ్వర్ రెడ్డి మా ఇంటి దగ్గరకు వచ్చి నానా బూతులు తిట్టాడు. నీ భర్త ఇంటికి వచ్చాక.. వివేకానందరెడ్డిని ఎట్లా చంపారో నీ భర్తను, నిన్ను కూడా అలాగే చంపుతామని బెదిరించాడు. ఆ బూతులను నా నోటితో నేను చెప్పలేను. చంపితే దిక్కేవరు ఉన్నారని కూడా మాట్లాడాడు. కాలు చెప్పుతో కొట్టబోయాడు. నేను ఇంట్లోని వేరే గదిలోకి వెళ్లి డోర్ పెట్టుకున్నాను. అతడి కొడుకు కూడా వచ్చాడు. అతడు కూడా చంపేస్తామని బెదిరింపులకు పాల్పడ్డాడు. పక్కనే ఉన్న బీరువాల అతడు వచ్చి వారిని పంపించి వేశాడు’’ అని తెలిపారు.
అలాగే పరమేశ్వర్ రెడ్డి తన ఇంటికొచ్చిన సమయంలో తనను తోసేయడంతో దెబ్బ తగిలిందని స్వాతి తెలిపారు. ‘‘మా ఇంటికొచ్చిన సమయంలో నా సెల్ లాక్కుని తోసేశాడు. వెనకాల భాగంలో దెబ్బతగలడంతో.. ఆస్పత్రికి వచ్చాను. నిన్న సాయంత్రం పోలీసులకు ఫిర్యాదు చేశాను. వాళ్లు ఫిర్యాదు అయితే తీసుకున్నారు. ఈ విషయాలు చెప్పాలంటే కూడా భయంగా ఉంది. మళ్లీ ఏం చేస్తారనే ఆందోళన ఉంది. మా కుటుంబంలో ఏ ఒక్కరికి ఏం జరిగిన పరమేశ్వర్ రెడ్డిదే బాధ్యత’’ అని స్వాతి అన్నారు. ఇక, వివేకానందరెడ్డి హత్య కేసులో ఉమాశంకర్ రెడ్డి ఏ-3గా ఉన్నాడు.
