బాలికలతో అశ్లీల నృత్యాలు.. ముఠా అరెస్టు
క్యాటరింగ్ పనుల పేరుతో బాలికలను ట్రాప్ చేసి, అశ్లీల నృత్యాలు చేయిస్తున్నారు. కాగా.. ఆ ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
విజయవాడలో మరోసారి అశ్లీల నృత్యాలు కలకలం రేపాయి. క్యాటరింగ్ పనుల పేరుతో బాలికలను ట్రాప్ చేసి, అశ్లీల నృత్యాలు చేయిస్తున్నారు. కాగా.. ఆ ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పూర్తి వివరాల్లోకి వెళితే...న్యూరాజరాజేశ్వరి పేట ప్రాంతానికి చెందిన బాలిక (15) తొమ్మిదవ తరగతి వరకు చదువుకుని ఇంట్లో ఆర్థిక పరిస్థితి బాగాలేకపోవడంతో నగరంలోని వివిధ వేడుకలకు క్యాటరింగ్ పనులకు వెళ్లేది. పనులకు వెళ్లే సమయంలో పరిచయమైన న్యూరాజరాజేశ్వరిపేట ప్రాంతానికి చెందిన షేక్ మౌనిక (37) విశాఖ జిల్లాలో క్యాటరింగ్ పనులు ఎక్కువుగా ఉంటాయని, డబ్బులు ఎక్కువ ఇస్తారని బాలికను నమ్మించింది.
గత నెల 18న విశాఖపట్నం వెళదామని చెప్పి, ట్రైన్లో బాలికను తీసుకుని బయలుదేరింది. కానీ బాలికను అనకాపల్లికి తీసుకువెళ్లింది. అక్కడ పిల్లి సంధ్య (29)కు బాలికను అప్పగించింది. సంధ్య స్థానికంగా ఉన్న యాదగిరి మైనర్బాబు (45) దగ్గరకు బాలికను తీసుకెళ్లింది. అతడు చేయాల్సింది క్యాటరింగ్ పనులు కాదు, వేడుకలలో డ్యాన్స్ ప్రోగ్రాంలని బాలికను బెదిరించాడు. వారు బాలికతో అశ్లీల నృత్యాలు చేయించారు. వాళ్ల ఆగడాలు భరించలేని బాలిక ఈ నెల 13న అనకాపల్లి నుంచి నగరానికి వచ్చింది. జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యుల ద్వారా అజిత్ సింగ్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
కేసును ఛాలెంజ్గా తీసుకున్న అజిత్ సింగ్ నగర్ సీఐ జగన్మోహన్ నాలుగు బృందాలను ఏర్పాటు చేసి, ముఠా కోసం గాలించారు. ప్రధాన నిందితులైన విశాఖ జిల్లాకు చెందిన పిల్లి సంధ్య ( 29), యాదగిరి మైనర్బాబు (45)లను అరెస్టు చేయడంతో పాటు వీరికి బాలికలను సరఫరా చేస్తున్న న్యూరాజరాజేశ్వరిపేట ప్రాంతానికి చెందిన షేక్ మౌనిక( 20) , కోరాడ జ్యోతి(40). సురభీ నాగదుర్గ(30), సులకం లక్ష్మమ్మ (46)లను అరెస్ట్ చేశారు. వీరిపై బాలికల అక్రమ రవాణా, కిడ్నాప్ సెక్షన్లు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ సమావేశంలో అజిత్సింగ్ననగర్ సీఐ జగన్మోహన్ పాల్గొన్నారు.