దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం... నేడు ఏపీలో వర్షాలు
ఈ నెల 11, 12, 13 తేదీల్లో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడనున్నాయని వాాతావరణ శాఖ తెలిపింది.
అమరావతి: దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని ఆంధ్ర ప్రదేశ్ వాతావరణ విభాగం తెలిపింది. దీని ప్రభావంతో ఈ నెల 11, 12, 13 తేదీల్లో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడనున్నాయని తెలిపింది. అలాగే ఈ అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో చలి తీవ్రత తగ్గుముఖం పట్టనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు.
ఇటీవల అల్పపీడన ద్రోణి, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రెండు రోజులు తెలుగురాష్ట్రాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసాయి ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడ్డాయి.
ముఖ్యంగా తెలంగాణలో ఎక్కవగా వర్షాలు పడ్డాయి. ఒక్క గురువారం కామారెడ్డి జిల్లా బిక్కనూర్లో అత్యధికంగా 21.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో కూడా వర్షం కురిసింది.
ఇక ఈ అల్పపీడన ద్రోణి, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆకాశం మేఘావృతం కావడంతో చలి తీవ్రత తగ్గింది. గురువారం అత్యల్పంగా కామారెడ్డి జిల్లా పిట్లంలో 17.1 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత రికార్డయింది. అక్కడక్కడ చిరుజల్లులు కురిశాయి. 19.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.