శివాజీని సీఎం చేయండి.. రఘువీరారెడ్డి
దాడి జరిగిన వీఐపీ లాంజ్లో సీసీ కెమెరా ఎందుకు పనిచేయడం లేదని అనుమానం వ్యక్తం చేశారు.
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడిని ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఖండించారు. జగన్ పై జరిగిన దాడి అతి హేయమైనదని ఆయన వాఖ్యానించారు. ఈరోజు ఆయన విలేకరులతో మాట్లాడుతూ... దాడి జరిగిన వీఐపీ లాంజ్లో సీసీ కెమెరా ఎందుకు పనిచేయడం లేదని అనుమానం వ్యక్తం చేశారు. తాను వైఎస్ జగన్తో విభేదించవచ్చు.. కానీ జరిగిన దాడిని మాత్రం ఖండిస్తున్నానని తెలిపారు. ప్రతిపక్ష నాయకుడి మీద దాడి జరిగితే ఒక ముఖ్యమంత్రి కనీసం ఫోన్ చేయాల్సిన బాధ్యత లేదా అని ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి అనేది ఒక బలీయమైన వ్యవస్థ అని, ఒక విశ్వసనీయ సమాచారం వస్తే విచారణ చేయించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపై ఉందని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి గరుడపురాణాన్ని ధ్రువీకరించారని, గరుడపురాణమంటూ ఆ వ్యక్తి చెప్పినట్టే జరుగుతుంది అనుకుంటే ఎందుకు విచారణ చేయించలేదని ప్రశ్నించారు. మీ ఇంటెలిజెన్స్ ఎక్కడికి పోయిందని ఎద్దేవా చేశారు. ఇక ఆ గరుడపురాణం చెప్పిన వ్యక్తినే సీఎం కుర్చీలో కూర్చోబెట్టండి.. మీరెందుకు దండగ అని దుయ్యబట్టారు.
నటుడు శివాజీ... ఆపరేషన్ గరుడ గురించి చెప్పిన సంగతి తెలిసిందే. ఆయన చెప్పినట్లుగానే జగన్ పై దాడి జరిగింది. ఈ నేపథ్యంలోనే శివాజీని ఉద్దేశించి రఘువీరా రెడ్డి పైవిధంగా వ్యాఖ్యానించారు.