టీడీపితో పొత్తుపై రఘువీరా రెడ్డి స్పందన ఇదీ
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటుందనే ప్రచారంపై ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షుడు రఘువీరా రెడ్డి స్పందించారు.
అనంతపురం: వచ్చే ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటుందనే ప్రచారంపై ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షుడు రఘువీరా రెడ్డి స్పందించారు. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు ఉండాలనే విషయంపై ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీదే తుది నిర్ణయమని ఆయన అన్నారు.
అధిష్టానం ఆదేశిస్తే ఎవరితోనైనా కలిసి పనిచేయడానికి సిద్దమేనని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ వ్యతిరేక శక్తులతో కలిసి పనిచేస్తామని, ఏపీలో కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేస్తున్నామని చెప్పారు.
రాజకీయాల్లో ఏదైనా సాధ్యమేనని, 2014లో జరిగిన రాష్ట్ర ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని భావించామని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే చివరి నిమిషంలో ఫలితాలు తారుమారయ్యాయని అన్నారు.
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కీలకపాత్ర పోషిస్తుందని అన్నారు. టీడీపీ, బీజేపీ వైఫల్యాలపై కరపత్రాలతో ఇంటింటా ప్రచారం చేస్తామని ఆయన చెప్పారు.