అమిత్ షాను కలిసిన రఘురామ కృష్ణమ రాజు కుమారుడు, కూతురు
సిఐడి చేతిలో అరెస్టైన వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామ కృష్ణమ రాజు కుమారుడు, కూతురు కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిశారు. తమ తండ్రిని అక్రమంగా అరెస్టు చేశారని వారు ఆరోపించారు.
న్యూఢిల్లీ: వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామ కృష్ణమ రాజు కుమారుడు భరత్, కూతురు ఇందు ప్రియదర్శిని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను కలిశారు. దీంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయం మరింత వేడెక్కినట్లు కనిపిస్తోంది.
తన తండ్రిని ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం వేధిస్తోందని వారు అమిత్ షాకు ఫిర్యాదు చేశారు. రఘురామ కృష్ణమ రాజుపై అక్రమ కేసులు పెట్టారని వారు చెప్పారు. తమ తండ్రి రఘురామను అరెస్టు చేయడం, ఆయనపై రాజద్రోహం కేసు నమోదు చేయడం వెనక కుట్ర ఉందని వారు ఆరోపించారు.
ఇదిలావుంటే, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రఘురామృష్ణమ రాజుకు సికింద్రాబాదులోని ఆర్మీ ఆస్పత్రిలో వైద్య పరీక్షల జరుగుతున్నాయి. గత రెండు రోజులుగా ఆయనకు వైద్య బృందం వైద్య పరీక్షలు నిర్వహించింది. వైద్య పరీక్షల నివేదికను తెలంగాణ హైకోర్టు ద్వారా సుప్రీంకోర్టుకు సీల్డ్ కవర్ లో సుప్రీం కోర్టుకు అందుతుంది.
మరోవైపు, రఘురామ కృష్ణమ రాజు దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ రేపు శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. ఆ బెయిల్ పిటిషన్ మీద ఏపీ సిఐడి ఇప్పటికే కౌంటర్ దాఖలు చేసింది.