విజయవాడ జిల్లాకు వంగవీటి రంగా పేరు పెట్టాలని టీడీపీ సీనియర్ నేత బొండా ఉమా చేపట్టిన దీక్షకు రాధారంగా మిత్రమండలి, కాపు నేతలు మద్ధతు తెలిపారు. అధికారం ఉందని ఇష్టం వచ్చినట్లు జిల్లాల విభజన చేస్తారా? అని వైసిపి ప్రభుత్వాన్ని బొండా ఉమా నిలదీసారు.

విజయవాడ (vijayawada district) కేంద్రంగా వంగవీటి రంగా జిల్లాను (vangaveeti ranga district) ఏర్పాటు చేయాలని డిమాండ్ ఊపందుకుంది. ఇప్పటికే పలువురు ఈ మేరకు ప్రభుత్వాన్ని కోరగా.. ఈసారి ఏకంగా టీడీపీ సీనియర్ నేత బొండా ఉమా (bonda uma) ఏకంగా దీక్షకు దిగారు. విజయవాడలోని ధర్నా చౌక్ లో ఆయన బుధవారం దీక్షకు కూర్చొన్నారు. ఆయన దీక్షకు రాధారంగా మిత్రమండలి నేత (radha ranga mitra mandali) చెన్నుపాటి శ్రీను, కాపు సంఘం నేతలు మద్దతు పలికారు. ఈ సందర్భంగా బొండా ఉమ మాట్లాడుతూ అధికారం ఉందని ఇష్టం వచ్చినట్లు జిల్లాల విభజన చేస్తారా? అని వైసిపి ప్రభుత్వాన్ని నిలదీసారు. అసలు ఇప్పుడు ఏర్పాటుచేయాలని నిర్ణయించిన కొత్త జిల్లాలతో ఉపయోగం ఏంటి..? కొత్త ఉద్యోగం ఒక్కటైనా వస్తుందా..? అని బోండా ఉమ నిలదీసారు. 

''వైసీపీ రాజకీయ ప్రయోజనాల కోసమే కొత్త జిల్లాల ఏర్పాటు జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. జిల్లాల విభజన విషయంలో రాష్ట్రం భగ్గుమంటుంటే సీఎం జగన్ ఎందుకు మాట్లాడటం లేదు'' అని ఉమా అడిగారు. ''దివంగత కాపు నాయకుడు వంగవీటి రంగా అభిమానులను కించపరిచే విధంగా వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. విజయవాడ జిల్లాకు రంగా పేరు పెట్టకుంటే అన్ని పార్టీలను కలుపుకొని రాబోయే రోజుల్లో ఈ ఉద్యమం ఉదృతం చేస్తాము. ముఖ్యమంత్రి నివాసాన్ని కూడా ముట్టడిస్తాం'' అని బోండా ఉమ హెచ్చరించారు. 

ఇక బోండా ఉమ నిరసన దీక్షలో పాల్గొన్న రాధారంగ మిత్రమండలి సభ్యులు చెన్నుపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ... వంగవీటి మోహనరంగా అందరి మనిషి, ప్రజల మనిషి అని అన్నారు. మరణించి ముప్పై ఏళ్లయినా నేటికీ ఆయన పేరుతో స్వచ్చందంగా కార్యక్రమాలు చేయడం ఆయన గొప్పతనమన్నారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసమే రంగా పరితపించే వారని శ్రీనివాస్ పేర్కొన్నారు. 

బోండా ఉమా లాంటివారు విజయవాడ జిల్లాకు రంగా పేరు పెట్టాలంటూ చేపట్టిన దీక్షను ఎవరూ రాజకీయంగా వాడుకోవద్దు. పశ్చిమ కృష్షాకు వంగవీటి మోహనరంగా జిల్లాగా పేరు పెట్టాలనే ఏకైక డిమాండ్ తో పోరాడాలి. రాజకీయాలు, కులాలు, మతాలకు అతీతంగా రంగాకు అభిమానులు ఉన్నారు. బోండా ఉమ కూడా రాజకీయాలు మాట్లాడకుండా లక్ష్యం సాధించేలా అందరూ కలిసి నడిచేలా చూడాలి'' అని రాధారంగ మిత్రమండలి సభ్యులు శ్రీనివాస్ సూచించారు.