అది నోరా... డ్రైనేజా , ఎంత పినాయిల్తో కడిగినా : గుడివాడలో కొడాలి నానిపై చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు
వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కొడాలి నానిపై సెటైర్లు వేశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు . కొడాలి నానిది నోరా డ్రైనేజా.. ఎంత ఫినాయిలే వేసి కడిగినా అతని నోరు మురికి కాలువేనంటూ వ్యాఖ్యానించారు.
![raa kadali raa : tdp chief chandrababu naidu fires on ex minister kodali nani in gudivada ksp raa kadali raa : tdp chief chandrababu naidu fires on ex minister kodali nani in gudivada ksp](https://static-ai.asianetnews.com/images/01hmbg0s87wxnb0djsehkr7qzw/untitled-design--60--png_363x203xt.jpg)
వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కొడాలి నానిపై సెటైర్లు వేశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు . గురువారం కృష్ణా జిల్లా గుడివాడలో నిర్వహించిన రా కదలిరా బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ.. వైసీపీ పాలనలో 100 సంక్షేమ పథకాలు రద్దు చేశారని దుయ్యబట్టారు. కొడాలి నానిది నోరా డ్రైనేజా.. ఎంత ఫినాయిలే వేసి కడిగినా అతని నోరు మురికి కాలువేనంటూ వ్యాఖ్యానించారు. నోరు తెరిస్తే ఆయన బూతులు మాట్లాడుతుంటాడని, ఎంత బూతులు మాట్లాడితే అంత పెద్ద నాయకులు అవుతారని అనుకుంటున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు. తన వద్దే రాజకీయాల్లో ఓనమాలు నేర్చుకుని, తనకే పాఠాలు చెబుతారా అంటూ నానిపై ఫైర్ అయ్యారు.
టీడీపీ జనసేనలు కలిశాయని తెలియగానే వైసీపీ నేతల్లో దడ మొదలైందని, ఏ సర్వే చూసినా తమ కూటమిదే విజయమని చెబుతున్నాయని చంద్రబాబు తెలిపారు. అందుకే 90 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చుతున్నారని, రాజకీయాల్లో తాను ఎక్కడా ట్రాన్స్ఫర్లు చూడలేదన్నారు. ఇక్కడి చెత్తను అక్కడికి, అక్కడి చెత్తను ఇక్కడికి మార్చుతున్నారని చంద్రబాబు సెటైర్లు వేశారు. ఈ ప్రభుత్వానికి మరో 83 రోజులే సమయం వుందని ఆయన జోస్యం చెప్పారు. బ్రిటీష్ వారి మాదిరిగానే జగన్ కూడా వ్యాపార సంస్థలు పెట్టి సంపదనంతా దోచేస్తున్నాడని చంద్రబాబు ఆరోపించారు.
వైసీపీ ప్రభుత్వం కొత్తగా భూ రక్షణ చట్టం తీసుకొస్తోందని.. ఇది అమల్లోకి వస్తే ప్రజల ఆస్తులన్నీ కొట్టేస్తారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక భూ రక్షణ చట్టం రద్దు చేస్తామని, జాబు రావాలంటే టీడీపీ జనసేన ప్రభుత్వం రావాల్సిందేనన్నారు. జగన్ మీ బిడ్డ కాదు.. రాష్ట్రానికి పట్టిన క్యాన్సర్ గడ్డ అని.. పద్ధతిలేని రాజకీయాలు చేసే వారి వల్ల ఎలాంటి ప్రయోజనం వుండదని చంద్రబాబు పేర్కొన్నారు.