ఓ పులస చేపను వేలంలో ఓ మహిళ రూ.19వేలకు దక్కించుకుంది. ఆమె నుంచి మరో వ్యక్తి రూ.26వేలకు కొనుగోలు చేశాడు.
యానాం : సీజన్ వచ్చిందంటే చాలు పులసలకు ఉండే గిరాకీ మాటల్లో చెప్పలేనిది. జీవితంలో ఒక్కసారైనా పులసకూర తినాలని అంటారు. పుస్తెలమ్మయిన పులస తినాల్సిందే.. అనే మాట కూడా ప్రచారంలో ఉంది. పులస చేపలకు ఉండే డిమాండ్ అలాంటిది. ఆ డిమాండ్ ను మరోసారి గుర్తు చేసింది మంగళవారం నాటి ఘటన.
యానాంలో మంగళవారం సాయంత్రం పుష్కర ఘాటు దగ్గరికి వనమాడి ఆదినారాయణ అనే మత్స్యకారుడు రెండు కిలోలకు పైగా బరువు ఉన్న పులస చేపను తీసుకువచ్చాడు. ఆ చేప అతని వలలో చిక్కింది. ఆ చేపను వేలం వేయగా.. కొల్లు నాగలక్ష్మి అనే మహిళ రూ.19వేలకు ఆ చేపను దక్కించుకున్నారు.
ఆమె దగ్గర నుంచి ఈ పులస చేపను రూ.26వేలకు వేరే వ్యక్తి కొనుగోలు చేశాడు. రావులపాలెంకు చెందిన ఓ ప్రముఖ రాజకీయ నాయకుడి కోసం ఆమె దగ్గర నుంచి చేపను కొనుగోలు చేసినట్లుగా సమాచారం.
